AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

365 రోజులూ తలుపులు తెరిచే.. తెలుగు రాష్ట్రంలోని చెంగాళమ్మ తల్లి దేవాలయం రహస్యాలు తెలుసా?

Chengalamma Thalli Temple: చెంగాళమ్మ దేవాలయం సూల్లూరుపేటలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా, రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 1.5 కిలోమీటర్లు దూరంలో ఉంది. భక్తులు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు నుంచి కూడా వస్తారు. ఈ ప్రాంతాన్ని గతంలో శుభ గిరి అని పిలిచేవారు. పశ్చిమవైపున కాళంగి నది ప్రవహిస్తుంది. ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

365 రోజులూ తలుపులు తెరిచే.. తెలుగు రాష్ట్రంలోని చెంగాళమ్మ తల్లి దేవాలయం రహస్యాలు తెలుసా?
Chengalamma Temple
Rajashekher G
|

Updated on: Mar 21, 2026 | 7:14 PM

Share

మన దేశంలో ఎన్నో ప్రత్యేక ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయం వెనుక విభిన్నమైన చరిత్ర, విరళమైన కథలు దాగి ఉంటాయి. వాటిలో కొన్ని ఆలయాల కథలు విన్నప్పుడు ఏదో తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అలా ప్రత్యేకతతో నిలిచిన ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దులోని సూల్లూరుపేటలో ఉన్న చెంగాళమ్మ తల్లి ఆలయం. భక్తులు 24 గంటలు, ఏ సమయంలో అయినా దర్శనం పొందే విధంగా అమ్మవారు ప్రత్యేకంగా ఆదేశించారని విశ్వసనీయంగా చెబుతారు. చెంగాళమ్మ దేవాలయం సూల్లూరుపేటలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్–తమిళనాడు సరిహద్దుకు దగ్గరగా, సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ నుంచి సుమారు 1.5 కిలోమీటర్లు దూరంలో ఉంది.

శుభ గిరి

ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే కాకుండా, పొరుగు తమిళనాడు రాష్ట్రం నుండి కూడా భక్తులు భారీగా వస్తారు. గతంలో ఈ ప్రాంతాన్ని శుభ గిరి అని పిలిచేవారు. ఈ శుభ గిరికి పశ్చిమ వైపున కాళంగి నది ప్రవహిస్తుంది. స్థానిక పురాణాల ప్రకారం, చెంగాళమ్మ తల్లి ఈ ప్రాంతంలో స్వయంభూ రూపంలో వెలసినది.

స్థల పురాణం – విగ్రహానికి సంబంధించిన కథ

కొన్ని శతాబ్దాల క్రితం, కాళంగి నది తీరానికి ఒక రాతి విగ్రహం చేరింది. ఆ ప్రాంతంలో నివసించే పశువుల కాపరులు విగ్రహాన్ని చూసి, గ్రామ పెద్దలకు సమాచారం ఇచ్చారు. గ్రామ పెద్దలు వచ్చి పరిశీలించినప్పుడు, అది అమ్మవారి విగ్రహమని గుర్తించారు. గ్రామస్థులు విగ్రహాన్ని గ్రామంలోకి తీసుకువచ్చి ఆలయం నిర్మించాలనుకున్నారు. కానీ రాత్రి చాలా ఆలస్యం కావడంతో, ఉదయాన్నే నిర్మాణంపై చర్చించాలని నిర్ణయించారు.

మహాద్భుతం

ఆ రాత్రి ఒక అద్భుతం జరిగింది. నదీ తీరంలో ఉంచిన విగ్రహం లేచి దక్షిణ ముఖంలో నిలబడింది. మరునాడు గ్రామస్థులు ప్రయత్నించినప్పటికీ విగ్రహాన్ని ఒక అడుగు కూడా కదలించలేకపోయారు. చివరికి విగ్రహం అక్కడే ఉంచబడింది.

చెంగాళమ్మ స్వప్న దర్శనం

నాటి రాత్రి, గ్రామ పెద్దకు చెంగాళమ్మ తల్లి స్వప్నంలో దర్శనం ఇచ్చి.. “నాకు ఆలయం ఈ స్థలంలో నిర్మించండి” అని ఆదేశించింది. గ్రామస్థులు ఆమె ఆదేశాలను పాటించి విరాళాలు సమకూర్చి ఆలయం నిర్మించారు. అమ్మవారు మహిషాసురమర్దిని రూపంలో ఉన్నందున, కాళీ రూపంలో పూజిస్తారు. దక్షిణ ముఖం కావడంతో దక్షిణ ముఖ కాళీ అని పిలుస్తారు. తమిళనాడు భక్తులు ఆమెను శెంగాళీ అమ్మన్ అని పూజించగా, కాలక్రమేణా చెంగాళమ్మగా పేరుగాంచారు.

చెంగాళమ్మ మహాత్మ్యాలు

1. వ్యాపారులకు పాఠం నేర్పిన చెంగాళమ్మ

ఒకసారి సూళ్లూరుపేటలో మిరియాల వ్యాపారులు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు.. ఒక వృద్ధురాలు వారి వద్దకు తలనొప్పిగా ఉందని గుప్పెడు మిరియాలు అడిగింది. వ్యాపారులు తమ వద్ద లేవంటూ అబద్ధం చెప్పారు. అవి మిరియాలు కాదు చోళ్లు అని అన్నారు. దీంతో వృద్ధురాలు “అవును, చోళ్లు అవుతాయి” అని వెళ్ళిపోయింది. మరుసటి రోజు, వారు మద్రాసు చేరి మిరియాల ముట్టలో చోళ్లు ఉన్నట్లు చూశారు. తప్పు తెలుసుకున్న వ్యాపారులు తిరిగి చెంగాళమ్మ ఆలయానికి వెళ్లి క్షమాపణ చెప్పారు. దీంతో వారిని నిజాయితీగా ఉండాలని హెచ్చరించిన అమ్మవారు.. తిరిగి చోళ్లను మిరియాలుగా మార్చి అనుగ్రహించారు.

2. స్వర్ణ మిరియాల హారం

వెంకటగిరి రాజా కూడా ఈ మహిమ విన్న తరువాత, చెంగాళమ్మకు బంగారు మిరియాల హారం, విలువైన కానుకలు సమర్పించారు. ఆ తర్వాత భక్తుల సహకారంతో బ్రహ్మాండమైన ఆలయం నిర్మించారు.

3. దొంగకు శిక్ష, క్షమాపణ

ఒక దొంగ ఆలయంలో నుంచి అమ్మవారి ఆభరణాలను దోచేందుకు ప్రయత్నించాడు. అద్భుతంగా, అమ్మవారి కోపం వల్ల అతను అంధుడయ్యాడు. కానీ తరువాత, క్షమాపణ చెప్పి ప్రార్థించగా.. చెంగాళమ్మ తల్లి అతని క్షమాపణను స్వీకరించి చూపు తిరిగి వచ్చేలా చేసింది. దీంతో అతడు అమ్మవారి భక్తుడిగా మారిపోయాడు.

ఆలయం తలుపులు లేకుండా

ఒక రోజు, ఆలయాధికారులు తలుపులు పెట్టాలని నిర్ణయించగా.. ఆ రాత్రి చెంగాళమ్మ తల్లి స్వప్నంలో తెలిపింది: 24 గంటలు భక్తులు చూస్తూ ఉంటారు.. తలుపులు అవసరం లేదు.. అని. అయితే, మరుసటి రోజు, వృక్షానికి ఆనుకున్న తలుపులు వృక్షంలో ఐక్యమైపోయాయి. ఇప్పటికీ ఆ ఆలయంలో తలుపులు లేవు.

ప్రత్యేకత – శూలం

ఆలయ ప్రాంగణంలో ఒక శూలంను పసుపు, కుంకుమ, చందనంతో అలంకరించి పూజిస్తారు. భక్తులు దీన్ని స్పర్శించి ప్రార్థిస్తే, మనసులోని కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. చెంగాళమ్మ ఆలయం ప్రతినిత్యం 365 రోజులు, 24 గంటలు భక్తుల దర్శనం కోసం తెరిచి ఉంటుంది. నిజమైన దేవతగా, భక్తుల పాలిట కల్పవల్లిగా, చెంగాళమ్మ తల్లి ఈ ఆలయంలో శాశ్వతంగా ఉంటుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని విశ్వసించడం మీ వ్యక్తిగతం.)

Follow Us