Chandrababu Grandson Devansh Birthday: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుటుంబ సమేతంగా శనివారం తిరుమలకు రానున్నారు. 21వ తేదీన మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఆయన తిరుమలకు చేరుకుని బస చేస్తారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం అన్నదానం ట్రస్టుకు రూ.30లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్టు సమాచారం.
టీడీపీ అధినేత చంద్రబాబు మనవడి పుట్టిన రోజును ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు, ఏపీ మంత్రి నారా లోకేష్-బ్రాహ్మణిల తనయుడు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకను తిరుమల శ్రీవారి సన్నిదిలో జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. తొలి పుట్టిన రోజు వేడుకను కూడా తిరుమలలోనే జరుపుకున్న నారావారి కుటుంబం.. ఈ ఏడాది కూడా తిరులమలేశుడి సన్నిధిలోనే నిర్వహించుకోనున్నారు. గత నాలుగు ఏళ్లుగా వీరి కుటుంబాలు ఇక్కడే దేవాన్ష్ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.
శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకుని అక్కడే బస చేయనున్నారు. ఈ నెల 21వ తేదీన ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా దర్శించుకోనున్నారు. చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి, తనయుడు దేవాన్ష్లు, సినీనటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ, ఆయన సతీమణి వసుంధర, ఇతర కుటుంబసభ్యులు శ్రీవారి సేవలో పాల్గొంటారు.
దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదానం ట్రస్ట్కు 30 లక్షల రూపాయలను విరాళంగా అందజేస్తారు. ఒకరోజు అన్న ప్రసాదం వితరణకు అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం భరిస్తుంది.