Apara Ekadashi: అపర ఏకాదశి రోజు ఈ ఒక్క పని చేస్తే చాలు.. పుణ్యంతో పాటు ధనవర్షం!
Apara Ekadashi 2026: తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాస కృష్ణ పక్ష ఏకాదశిని అపర ఏకాదశిగా పూజిస్తారు. ఈ పవిత్ర వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే పాప విముక్తి, అపార పుణ్యం, ఐశ్వర్యం, శ్రీమన్నారాయణుని అనుగ్రహం లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అపర ఏకాదశికి సంబంధించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అపర ఏకాదశి 2026 – విశిష్టత, వ్రత విధానం, పూజా నియమాలు, వ్రత కథ: తెలుగు పంచాంగం ప్రకారం వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశిని అపర ఏకాదశి అని పిలుస్తారు. “అపర” అనే పదానికి అపారమైన సంపద, పుణ్యం, కీర్తి, ఐశ్వర్యం అనే అర్థాలున్నాయి. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే పాప విముక్తి కలిగి, శ్రీమన్నారాయణుని కటాక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
అపర ఏకాదశి ఎప్పుడు?
2026 సంవత్సరంలో అపర ఏకాదశి మే 13, బుధవారం రోజున వస్తోంది. ఈ రోజు శ్రీమహావిష్ణువును ఆరాధిస్తూ ఉపవాసం చేయడం ద్వారా అపారమైన పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం.
అపర ఏకాదశి విశిష్టత
అపర ఏకాదశి రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని పూజించడం శ్రేష్ఠంగా భావిస్తారు. ఈ రోజు ఉపవాసం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల: పాపక్షయం కలుగుతుంది, కీర్తి, ఐశ్వర్యం పెరుగుతాయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది. మోక్షప్రాప్తి కలుగుతుందని పురాణోక్తి. తులసీదళాలతో శ్రీహరిని అర్చించడం ఈ రోజున అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు.
అపర ఏకాదశి వ్రత నియమాలు
ఈ వ్రతాన్ని ఆచరించేవారు కొన్ని నియమాలను పాటించడం మంచిది:
- ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి
- అవసరమైతే రాత్రివేళ పాలు, పండ్లు మాత్రమే తీసుకోవచ్చు
- ద్వాదశి పారణ పూర్తయ్యే వరకు నియమం కొనసాగించాలి
- సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి
- బ్రహ్మచర్యం, భూశయనం పాటించడం శ్రేయస్కరం
వ్రత విధానం-దశమి రోజు
వ్రతం దశమి సాయంత్రం నుంచే ప్రారంభమవుతుంది. ఆ రోజు రాత్రి తేలికైన సాత్వికాహారం తీసుకోవాలి.
ఏకాదశి రోజు
- తెల్లవారుజామున లేచి స్నానం చేయాలి
- వీలైతే నదీస్నానం చేయాలి
- ఇంట్లో స్నానం చేస్తే పుణ్యనదులను స్మరించుకోవాలి
- ఇంటిని శుభ్రపరిచి పూజా మందిరంలో శ్రీలక్ష్మీనారాయణుల చిత్రపటం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి
పూజా విధానం
- ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి
- గంధం, కుంకుమతో అలంకరించాలి
- పసుపు రంగు పూలు, తామరపూలు సమర్పించాలి
- తులసీదళాలు తప్పనిసరిగా ఉపయోగించాలి
- విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి
- నైవేద్యంగా: కొబ్బరికాయ, అరటిపండ్లు, పులిహోర
- చక్రపొంగలి, వంటివి సమర్పించవచ్చు.
- పూజ అనంతరం అపర ఏకాదశి వ్రత కథను చదివి హారతి ఇవ్వాలి.
ఆలయ దర్శనం
- ఇంట్లో పూజ అనంతరం సమీపంలోని విష్ణు ఆలయానికి వెళ్లి: తులసి మాలను సమర్పించడం
- అన్నదానం చేయడం
- ప్రసాద పంపిణీ చేయడం
- వంటి సేవలు చేయడం శుభప్రదంగా భావిస్తారు.
ఏకాదశి జాగరణ
ఏకాదశి రాత్రి జాగరణకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ సమయంలో భజనలు, నామసంకీర్తన, విష్ణు కథలు, భక్తి గీతాలు, వింటూ శ్రీహరిని స్మరించాలి. ప్రాపంచిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది.
ద్వాదశి పారణ
మరుసటి రోజు ద్వాదశి నాడు:
- స్నానం చేసి పూజ పూర్తి చేయాలి
- ముందుగా అతిథికి లేదా అవసరమైన వారికి భోజనం పెట్టాలి
- ఆ తర్వాత తానే భోజనం చేయాలి
- ద్వాదశి రోజున ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం, మద్యపానం వర్జ్యం.
అపర ఏకాదశి వ్రత కథ
పూర్వం మహిధ్వజుడు అనే రాజు ధర్మపరుడిగా ప్రజలను పరిపాలించేవాడు. అతని కీర్తిని చూసి అసూయ చెందిన తమ్ముడు వజ్రధ్వజుడు అతన్ని హత్య చేసి అడవిలో పాతిపెడతాడు. అకాల మరణం, ఉత్తరకర్మలు జరగకపోవడంతో మహిధ్వజుడు పిశాచిగా మారి అడవిలో సంచరిస్తూ బాధపడుతుంటాడు. ఒక రోజు ఆ మార్గంలో వెళ్తున్న మహర్షి అతని స్థితిని తెలుసుకుని కరుణతో అపర ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. ద్వాదశి నాడు ఆ వ్రత ఫలాన్ని మహిధ్వజునికి అర్పించగా అతనికి పిశాచ జన్మ నుంచి విముక్తి లభించి మోక్షం కలుగుతుంది.
వివిధ ప్రాంతాల్లో అపర ఏకాదశి
- భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఏకాదశిని భిన్న పేర్లతో జరుపుకుంటారు.
- పంజాబ్, హర్యానా, జమ్మూకాశ్మీర్ ప్రాంతాల్లో — భద్రకాళి ఏకాదశి
- ఒడిశాలో — జలక్రీడ ఏకాదశి
- పేర్లు మారినా భక్తి భావం మాత్రం ఒకటే.
చివరగా, అపారమైన పుణ్యాన్ని ప్రసాదించే అపర ఏకాదశి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం ద్వారా శ్రీమన్నారాయణుని కటాక్షం పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. ఉపవాసం, జపం, దానం, భక్తితో ఈ పవిత్ర రోజును గడిపి సకల శుభాలు పొందుదాం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)
