
తెలంగాణ రాష్ట్రంలో అనేక చారిత్రక ఆలయాలు ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా ప్రముఖంగా కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం గురించి చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్నగర్ జిల్లా, అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామంలో ఈ అద్భుత ఆలయం ఉంది. ఇది ప్రసిద్ధ చారిత్రక, ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తించబడింది. పురాతన శైవాలయాలలో ఇది ప్రత్యేక స్థానం పొందింది. “దక్షిణ కాశీ”గా ప్రసిద్ధి చెందింది. భక్తులను ఆకర్షించే అనేక విశిష్టతలతో ఇది గుర్తింపు పొందింది. చరిత్ర ప్రకారం, ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించారని చెబుతారు.
కందూరు సమీపంలో ఒకప్పుడు కందూరు చోళుల రాజధానిగా వెలుగొందింది. క్రీ.శ. 1025–1248 మధ్య, కల్యాణి చాళుక్యులు, కాకతీయులు సమంతులుగా కందూరు చోళులు ఈ ప్రాంతాన్ని పాలించారు. త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ ప్రాంతానికి వచ్చి శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రాచీన కథనం చెబుతుంది. అందువలన ఆలయానికి “శ్రీ రామలింగేశ్వర స్వామి” అని పేరు పెట్టారు.
పూర్వంలో రామలింగేశ్వర స్వామి ఆలయం సమీప గుట్టపై ఉండేది. తాంబళి వంశానికి చెందిన ఒక భక్తురాలు గర్భిణీ అయ్యాక కూడా ప్రతిరోజు గుట్టపైకి ఎక్కి దర్శనం చేసేది. దీంతో స్వామివారు రథంలో భక్తురాలి వద్దకు చేరి దర్శనమిచ్చాడు. భక్తురాలు రథచక్రాల శబ్దాన్ని విని వెనక్కి తిరిగి చూసినందున ఒక చక్రం కోనేరులో పడిపోయి, మరొకటి లింగాకృతిగా ఏర్పడి, రామలింగేశ్వర స్వామిగా ఆలయంలో స్థిరమయ్యారు.
కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయం చారిత్రక, ఆధ్యాత్మిక, శిల్ప కళల పరంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన క్షేత్రం. దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం భక్తులను ప్రేరేపించే శక్తి కలిగి ఉంది.