‘శరద్ పవార్ నిజానికి దూరంగా మాట్లాడుతున్నారు’, ‘అనిల్ దేశ్ ముఖ్ వైదొలగాల్సిందే !’ ఫడ్నవీస్
ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయాలని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు...
ముంబై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేయాలని బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ డిమాండ్ చేశారు. అనిల్ తన పదవిలో ఉన్నంతవరకు దర్యాప్తు సరిగా జరగదని, అందువల్ల ఆయన రాజీనామా చేయాల్సిందేనని అన్నారు. పోలీసుల బదిలీల్లో అవినీతి జరుగుతోందని పరమ్ బీర్ సింగ్ కి ముందు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ సుబోధ్ జైస్వాల్ ఓ నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారని, కానీ ఆయన స్పందించలేదని, దాంతో డీజీ తన పదవికి రాజీనామా చేశారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. అనిల్ దేశ్ ముఖ్ ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సమర్థిస్తున్నారని, ఇద్దరూ మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారేనని ఆయన చెప్పారు. రాష్ట్రంలో శివసేన ప్రభుత్వంలో కాంగ్రెస్, ఎన్సీపీ కూడా ఓ కూటమిగా ఉన్నాయి. పవార్ ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, అందువల్ల అనిల్ ని సమర్థిస్తారని, సీఎం ఉద్ధవ్ థాక్రే ఆదేశాలతోనే సచిన్ వాజేని హోమ్ మంత్రి మళ్ళీ సర్వీసులోకి తీసుకున్నారని ఫడ్నవీస్ అన్నారు. సత్యం నుంచి పవార్ దూరంగా జరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
హోమ్ మంత్రి పై వచ్చిన తీవ్రమైన ఆరోపణలపై ముఖ్యమంత్రి దర్యాప్తునకు ఆదేశించవచ్చునని ఫడ్నవీస్ అన్నారు. కానీ ఆయన మౌనంగా ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయో, లేదో తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. అయితే ఇవన్నీ ఈ ప్రభుత్వంపై ప్రభావాన్ని చూపబోవని తాను భావిస్తున్నానన్నారు. కాగా.. మహారాష్ట్రలో ఉధ్ధవ్ ఠాక్రే ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోయిందని కేంద్ర మంత్రి రవిశంకర ప్రసాద్ వ్యాఖ్యానించిన సంగతి గమనార్హం .
మరిన్ని ఇక్కడ చదవండి: BJP manifesto for Bengal elections: బెంగాల్ ఎన్నికల వేళ మేనిఫెస్టోలో ప్రజలకు వరాలు ప్రకటించిన బీజేపీ
‘అమెరికా ఇండియాను 200 ఏళ్ళు పాలించింది’, ఉత్తరాఖండ్ సీఎం తీరత్ సింగ్ రావత్ వ్యాఖ్య