చీరాలలో టెన్షన్…టెన్షన్…మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్సస్ ప్రజా సంఘాల నేతలుగా అక్కడ ప్రస్తుతం నడుస్తోంది. సామాజిక కార్యకర్త, మాజీ విలేకరి నాయుడు నాగార్జునరెడ్డిపై దాడికి కారణం ఆమంచి వర్గీయులే అంటున్న ప్రజా సంఘాల నేతలు. ఆమంచి వర్గీయులే దాడి చేశారని బాధితుడు నాగార్జునరెడ్డి కూడా పోలీసులకు, జడ్జికి వాంగ్మూలం ఇవ్వడంతో చీరాలలో ఇదే హాట్ టాపిక్గా మారింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని అటు ఆమంచి వర్గం.. ఇటు వైసీపీ పార్టీకి కూడా సంబంధం లేదని ఇరు పార్టీలు అంటున్నారు.
పదేళ్లుగా చీరాలలో ప్రజాస్వామ్యం లేదు. ఇసుక మాఫియా చేతుల్లోనే అన్నీ బందీ అయిపోయాయి. ఎవరైనా ఎదిరిస్తే వారికి అనేక ఇక్కట్లు తప్పడం లేదు. ప్రశ్నిస్తున్న మాలాంటి ప్రజాసంఘాల వారిని వేధిస్తున్నారు. అందులో భాగమే నాగార్జునరెడ్డి మీద వరుసగా హత్యాయత్నాలు అంటూ చెప్పుకొచ్చారు చీరాలలోని ఎరుకుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మోహన్కుమార్ ధర్మా.
చేనేతల ఖిల్లా చీరాల ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలకు వేదికగా మారింది. ప్రగడ కోటయ్య, కొణిజేటి రోశయ్య వంటి ఉద్దండులు రాజకీయాలు నడిపిన ఈ గడ్డపై ఇప్పుడు రక్త చరిత్ర రాస్తున్నారు నేతలు…చేనేత కార్మిక నేతగా ప్రసిధ్ధి చెందిన ప్రగడ కోటయ్య, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టృ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వంటి ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది.1951లో ఏర్పడిన ఈ అసెంబ్లీ స్ధానానికి 1981లో జరిగిన ఉప ఎన్నికతో కలిపి మొత్తం 16 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, కాంగ్రెస్[ఐ] ఏడు సార్లు, తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు, జనతాపార్టీ, ఇండిపెండెంట్, సీపీఐ, నవోదయం పార్టీలు ఒక్కోసారి గెలిచాయి. పదేళ్ళ క్రితం వరకు ఇక్కడి రాజకీయాలు సాదాసీదాగా, ప్రశాంతంగానే జరిగాయి. ఈ పదేళ్ళలోనే ఇక్కడి రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. రాజకీయ నేతలు వ్యక్తిగత కక్షలతో ఒకరిపై ఒకరు దాడులు, ప్రతిదాడులు చేసుకునే స్థాయికి చేరుకున్నారు. చివరకు హత్యలు, హత్యాయత్నాలు కూడా కొనసాగతున్నాయి. దీంతో చీరాల ప్రజలు రాజకీయాలంటేనే చీదరుంచుకునే స్థాయికి వెళ్ళిపోయారు.
ఈ నేపధ్యంలో చీరాలలో ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్న ఆమంచి కృష్ణమోహన్, ఆయన సోదరుడు స్వాములు, ఇతర కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆరోపణలు, కేసులు వందకుపైగానే ఉన్నాయి. ఒక్క ఆమంచి కృష్ణమోహన్ పైనే 38 కేసులు, ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములుపై 25, వీరి తండ్రి ఆమంచి వెంకటేశ్వర్లుపై 25 పోలీసు కేసులు ఉన్నాయి. ఇవన్నీచీరాల, వేటపాలెం పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయి. తాజాగా మరికొన్ని ఫిర్యాదులూ అందుతున్నాయి.
కాగా.. తనపై దాడి సంఘటనలో ఆమంచి కుటుంబం ప్రమేయం ఉందని బాధితుడు నాగార్జునరెడ్డి పోలీసులకు స్టేట్మెంట్ ఇవ్వడాన్ని ఆమంచి వర్గీయులు కొట్టిపారేస్తున్నారు. నాగార్జునరెడ్డికి చాలా మందితో విరోధం ఉందని, ప్రస్తుతం జరిగిన దాడిని అడ్డం పెట్టుకుని ఆమంచి కుటుంబంపై ఆరోపణలు చేయడం సరికాదని చెబుతున్నారు. ఈ మేరకు చీరాలలో పోలీసులను కలిసి వినతి పత్రం అందించారు. తమ నేత ఆమంచి కృష్ణమోహన్ ప్రమేయం ఇందులో ఏమాత్రం లేదంటూ వినతి పత్రంలో పేర్కొన్నారు.
అయితే.. మరోవైపు నాగార్జున రెడ్డిపై దాడి సంఘటనలో వైసీపీని తెరపైకి తీసుకురావద్దని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ అమృతపాణి స్పష్టం చేస్తున్నారు. వైసీపీ పార్టీకి కానీ, కార్యకర్తలకు కానీ ఈ దాడితో సంబంధం లేదని, ఇది కేవలం వ్యక్తిగత కక్షలతోనే జరిగిందని చెబుతున్నారు. ఈ దాడి వెనుక ఎవరు ఉన్నారో బాధితుడే స్పష్టంగా పోలీసులకు చెప్పాడని, అంతే కాకుండా చీరాల ప్రజలకు కూడా నిందితులెవరో బాగా తెలుసంటున్నారు. రౌడీ రాజకీయాలను, గూండాగర్దీని వైసీపీ అధిష్టానం కానీ, సీఎం జగన్ కానీ ప్రోత్సహించరని గుర్తించుకోవాలంటున్నారు. అయితే.. ఈ సంఘటనలో నిందితులను మాత్రం కఠినంగా శిక్షించాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు.
ఈ సంఘటనపై చినగంజాం పీఎస్ పరిధిలో క్రైమ్ నంబర్ 130/2019కింద కేసు నమోదైంది. బాధితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా 26 మందిపై కేసు పెట్టారు. వారిలో ఆమంచి కుటుంబీకులు కూడా ఉన్నారు. కృష్ణ మోహన్, సోముల పాత్ర గురించి నాగార్జున రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో ఉంది. ఇప్పటికే ఆమంచి వ్యక్తిగత కార్యదర్శి సాబినేని రాంబాబుతో పాటు పొగడదండ నరసింహారావు, చింతం సోమేశ్వర రావు, మేకపోతుల శ్రీహరి, వాలేటి షైనీ అబ్రహం, కాటుకురి భరత్ కుమార్ అనే ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే బాధితుడు పేర్కొన్న ఆమంచి కుటుంబ సభ్యులు అరెస్టయిన వారిలో లేకపోవడంతో ప్రజా సంఘాల నేతలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా.. ప్రశాంతంగా ఉండే చీరాలలో.. ఇప్పుడు హాట్ హాట్గా ఉంది.