కాశ్మీర్ ‘ప్యారడైజ్’ అయితే బెంగాల్ కూడా ఇలా కాకూడదా ? సువెందు అధికారిపై ఒమర్ అబ్దుల్లా ఫైర్
బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కాశ్మీర్ లా మారుతుందంటూ బీజేపీ నేత సువెందు అధికారి చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు....
బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం కాశ్మీర్ లా మారుతుందంటూ బీజేపీ నేత సువెందు అధికారి చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. ఈ వ్యాఖ్య మూర్ఖమైనది, అర్థరహితమైనదని ఆయన దుయ్యబట్టారు. ఆర్టికల్ 370 ని కేంద్రం రద్దు చేసిన అనంతరం కాశ్మీర్ స్వర్గంలా మారిందని మీ పార్టీయే అంటోందని, అలాంటప్పుడు బెంగాల్ రాష్ట్రం కూడా కాశ్మీర్ లా మారితే తప్పేమిటని ఆయన అన్నారు. మీ పార్టీ వారు కాశ్మీర్ కి వఛ్చి ఇక్కడి ప్రకృతి అందాలను పొగుడుతూ ఉంటారని ఆయన చెప్పారు. ఏమైనా బెంగాలీలు మా రాష్ట్రాన్ని ఎంతో ఇష్టపడతారని, అందువల్ల మీ ‘స్టుపిడ్’, టేస్ట్ లెస్ కామెంట్ ని క్షమిస్తున్నానని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. నిన్న బెంగాల్ లోని బెహరా లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన సువెందు అధికారి.. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వఛ్చిన పక్షంలో రాష్ట్రం కాశ్మీర్ లా మారిపోతుందని వ్యాఖ్యానించారు. అంటే ఆయన ఉద్దేశం దాదాపు సదా ఉగ్రవాదుల దాడులు , హింసతో కాశ్మీర్ సతమతమవుతుంటుందని అందువల్ల ఈ రాష్ట్రాన్ని కూడా అలా మార్చరాదన్నదే. కానీ ఈ వ్యాఖ్యలను ఒమర్ అబ్దుల్లా తప్పు పట్టారు.
బెంగాల్ ఎన్నికల్లో సువెందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడనుంచి బరిలోకి దిగిన సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఆయన సవాల్ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తాను ఆమెను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానని, అలా కానీ పక్షంలో రాజకీయాల నుంచి తప్పుకుంటానని అధికారి అన్నారు. అయితే మమత కూడా తక్కువ తినలేదు. ఈ సవాలును స్వీకరిస్తున్నానని, ఎవరేమిటో ఎన్నికల రణ క్షేత్రంలో తేల్చుకుందామని ఆమె వ్యాఖ్యానించారు. బెంగాల్ లో 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం భారీగా పారా మిలిటరీ బలగాలను తరలిస్తున్నారు, ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో కెల్లా బీజేపీ బెంగాల్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టింది.
మరిన్ని ఇక్కడ చదవండి: