
సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 78వ వ్యవస్థాపక వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీఎంఎఫ్ఆర్ఐ వైజాగ్ రీజన్ కార్యాలయం ఆధ్వర్యంలో మెరైన్ ఫిషరీస్, బయోడైవర్సిటీ పై అవగాహన కార్యక్రమం, ప్రదర్శన ఏర్పాటు చేశారు. సముద్ర వైవిధ్యం, జలచరాల ప్రదర్శనలు, శాస్త్రవేత్తలతో ఇంటరాక్టివ్ సెషన్స్ పెట్టారు. ఇందులో భాగంగా.. విద్యార్థులు ఔత్సాహికుల కోసం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు.

లైవ్ ఫిష్ తో పాటు.. సముద్రంలో జీవించే వివిధ రకాల చేపలను ప్రదర్శించారు. పీతలు, నత్తల నుంచి.. రిబ్బన్ ఫిష్, స్క్విడ్, హిల్సా, ట్యూనా, బల్లి చేప, పవర్ ఫిష్, క్రోకర్, రెడ్ లయన్ ఫిష్, జెల్లీ ఫిష్, టేకు చేపలను ప్రదర్శనకు ఉంచారు.

దీంతోపాటు.. సముద్రంలో లభించే కొన్ని జాతుల చేపలను లైవ్ గా చూపించారు. అలాగే లాబ్ స్టర్ రొయ్యలు లైవ్ గా ప్రదర్శనకు పెట్టారు. అలాగే వివిధ రకాల రొయ్యలు, అక్టోపస్, సముద్రపు మొక్కలు, నత్తలు, ఇతర జీవులను కూడా ప్రదర్శించారు.

వీటితోపాటు.. సముద్ర జీవులపై అధ్యయనం, ఉత్పత్తి పెంచడం, సముద్రపు మొక్కలు.. వాటి ఉపయోగాలు.. చేపలకు కృత్రిమ ఆవాసాలు.. చేపలు పట్టుకునే విధానం, సముద్రంలో చేపలను పెంపకం, శాస్త్రీయ సాంకేతిక విధానాలు, పరిశోధనలు, మెరైన్ ఫిషరీస్ లో అవలంబించాల్సిన విధానాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించామన్నారు సీఎం ఎఫ్ ఆర్ ఐ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ జో కిజాకుడన్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ రాజు.

గతంలో ఎన్నడూ చూడని విధమైన చేపలు సముద్ర జీవుల ప్రదర్శనతో విద్యార్థులు క్యూ కట్టారు. ఆసక్తిగా సముద్ర జీవులను తిలకించడమే కాకుండా వాటికోసం శాస్త్రవేత్తలను అడిగి విజ్ఞానాన్ని పెంచుకున్నారు. ఒకే చోట విభిన్న రకాల సముద్ర చేపలు, జీవులు, మొక్కలు కనిపించడంతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ విద్యార్థులకు కలిగింది.