
మరో అల్పపీడనం ముప్పు ముంచుకొస్తోంది.. ఈనెల 21న దక్షిణ అండమాన్పై ఏర్పడే ఉపరితల ఆవర్తనం.. 23 నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడనుందని.. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం మంగళవారం ప్రకటన విడుదల చేసింది..

దక్షిణ అండమాన్ సముద్రం - దాని పరిసర ప్రాంతాలు మీదుగా ఉపరితల ఆవర్తనం సుమారు నవంబర్ 21న ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళా ఖాతం మీదుగా నవంబర్ 23న అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, తదుపరి రెండు రోజుల లో మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉంది.

అంతేకాకుండా.. ఆంధ్ర ప్రదేశ్ - యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య / తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ - యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ - రాయలసీమ వాతావరణం.. మంగళవారం, బుధవారం, గురువారం.. వాతావరణము పొడిగా ఉండే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ప్రకటనలో తెలిపారు. అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే.. ఆవర్తనం, అల్పపీడనం ఏర్పడిన తర్వాత వాతావరణం మారే అవకాశం ఉందని అంచనావేసింది.

బంగళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం.. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనించే క్రమంలో తుఫానుగా మారనుంది. ఈ నెల 26 లేదా 27నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా రానుంది. దీని ప్రభావం రాయలసీమ, దక్షిణ కోస్తాలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనావేస్తోంది..