Weather Report: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత.. రోడ్లన్నీ జలమయం.. రైతుల కంట ఆగని కన్నీరు..
మాడు పగిలే ఎండాకాలంలో తడిచి ముద్దయ్యే వానలు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. అకాల వర్షాలతో పంట నష్టాలు, ఉరుములు, మెరుపులు, పిడుగులు...ఆగని కుండపోత..హైదరాబాద్లో అయితే.. మొదలైతే చాలు దంచికొడుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. అటు ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి..
Updated on: May 01, 2023 | 7:16 AM

TS Rains

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఆదివారం రాత్రి ఈదురుగాలులతో కుండపోత వానపడింది. ఆదివారం ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై ఉండగా.. రాత్రి 9 గంటల నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఖమ్మం జిల్లా వైరా మండలం పరిసర గ్రామాలలో ఈదురు గాలులతో వర్షం ఆగకుండా పడుతూనే ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వానలు పడుతూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. రైతులకు పనికిరాకుండా పోయింది.తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వానలు జోరు పెంచాయి.. పంటలను నాశనం చేస్తున్నాయి.

కొన్ని చోట్ల చెట్లు కూలిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు నీట మునడంతో రోడ్లపై మోకాళ్లలోతు నీళ్లు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. నాలాల వెంబడి వరద నీరు ఉధృతంగా ప్రవహించింది. ఎక్కడ గుంతలు ఉన్నాయో, మ్యాన్ హోల్స్ ఉన్నాయో తెలియక జనం ఆందోళనకు లోనయ్యారు. అత్యధికంగా శేరిలింగంపల్లి ఖాజాగూడలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఆ తర్వాత షేక్పేటలో 5.2 సెంటీమీటర్లు, జూబ్లీహిల్స్లో 4.6 సెంటీమీటర్లు, మాదాపూర్లో 4.5 సెంటీమీటర్లు, సింగిరేణికాలనీలో 4.1 సెంటీమీటర్లు, అమీర్పేటలో 4.0 సెంటీమీటర్లు, ఎంసీఆర్హెచ్ఆర్డీలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కుత్బుల్లాపూర్, బాలానగర్, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, కేపీహెచ్బీ, బాచుపల్లి, నిజాంపేట, హైదర్నగర్, సుచిత్ర, సూరారం, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వర్షం దంచి కొట్టింది. భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ ప్రకటించింది. భారీ వర్షం, ఈదురుగాలులతో జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ప్రాంతంలో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. అటుగా బైక్పై వెళుతున్న గ్రౌహౌండ్స్ కానిస్టేబుల్ వీరాస్వామి (40)పై విద్యుత్ తీగలు తెగి పడటంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు.

అటు ఏపీలోనూ దంచికొడుతున్న వానలు. వానలు దంచికొడుతున్నాయి. విజయవాడలో అయితే...ఆగకుండా గంటసేపు భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో.. బస్టాండ్ దగ్గర ప్రయాణీకులు అవస్థలు పడ్డారు. పలు చోట్ల డ్రైనేజీలు పొంగడం తో ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. మరో రెండ్రోజుల పాటు ఏపీలో వర్ష సూచన ఉన్నట్లు అధికారులు చెప్పారు. గుంటూరు జిల్లాలో సేమ్ సీన్. చేతికందిన పంట వానపాలు కావడంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో ఉరుములు మెరుపులతో వాన, శ్రీశైల మల్లన్న దగ్గర వీధులన్నీ జలమయమయ్యాయి. ఇలా ప్రతి చోటా వానలు తడిపేస్తున్నాయి. వాతావరణ శాఖ బీ అలెర్ట్ అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది.





























