Ford India: ఫోర్డ్ ఇండియా కీలక నిర్ణయం.. భారత్లో ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తికి గుడ్బై
Ford India: ఇండియాలో శాశ్వతంగా వైదొలగాలని అమెరికా కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ నిర్ణయించుకుంది. గతంలో భారత్లో కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినా.. విద్యుత్ వాహనాల తయారీకి..
Updated on: May 12, 2022 | 9:43 PM

Ford India: ఇండియాలో శాశ్వతంగా వైదొలగాలని అమెరికా కార్ల తయారీ కంపెనీ ఫోర్డ్ నిర్ణయించుకుంది. గతంలో భారత్లో కార్ల ఉత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించినా.. విద్యుత్ వాహనాల తయారీకి ప్రణాళిక రూపొందించామని, పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) స్కీం కింద అనుమతించాలని కేంద్రానికి దరఖాస్తు చేసుకుంది.

కేంద్ర ప్రభుత్వం కూడా పీఎల్ఐ అప్లికేషన్కు ఆమోదం తెలుపడంతో ఫోర్డ్ తిరిగి దేశంలో కార్ల ఉత్పత్తిని కొనసాగిస్తుందని అంతా భావించారు. కానీ ఇండియాలో ఎలక్ట్రిక్ కార్ల తయారీని ఉపసంహరించుకున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ పీఎల్ఐ స్కీమ్ కింద ఎటువంటి పెట్టుబడులు పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేస్తూ ప్రభుత్వానికి సమాచారం అందించింది.

తమ పీఎల్ఐ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపింది. ఇంతకుముందు తమ వ్యాపార ప్రణాళికలను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు పేర్కొంది. కాగా, ఫోర్డ్ ఇండియాతో పాటు 20 ఇతర ఆటోమొబైల్ కంపెనీలు పీఎల్ఐ స్కీమ్ కింద ఎంపికయ్యాయి.

ఈ స్కీమ్ కింద కేంద్రం సదరు ఆటోమొబైల్ కంపెనీలకు రూ.45,016 కోట్లు చెల్లించనుంది.భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఆటోమేకర్లను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పీఎల్ఐ స్కీం తీసుకొచ్చింది.




