
అటల్ సేతు బ్రిడ్జ్ ని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) అని కూడా పిలుస్తారు. దీనిని శుక్రవారం నాడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడింది. ఇది భారతదేశపు అతి పొడవైన సముద్ర వంతెన.

ముంబై వాసుల రవాణాలోని కనెక్టివిటీని మారుస్తూ అత్యాధునిక సాంకేతికతలతో నిండిన ఇంజనీరింగ్ నైపుణ్యం అద్భుతంగా కనిపిస్తోంది. ముంబయి స్కైలైన్కి ధీటుగా నిలబడి.. భారతదేశంలో పెరుగుతున్న ఇంజనీరింగ్ నైపుణ్యానికి ఈ వంతెన నిదర్శనంగా నిలుస్తోంది. కేవలం ఐదేళ్లలో నిర్మించబడిన ఈ బ్రిడ్జి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.

భారతదేశంలోనే తొలిసారిగా ఈ టెక్నాలజీని వినియోగించినట్లు (MMRDA) మెట్రోపాలిటన్ కమిషనర్ సంజయ్ ముఖర్జీ తెలిపారు. అటల్ సేతు బ్రిడ్జిలో ఉపయోగించిన సాంకేతికతలు వంతెనను మరింత సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు దోహదపడుతుందన్నారు. అలాగే పూర్తి పర్యావరణ అనుకూలమైన మెటీరియల్ తో నిర్మించినట్లు వెల్లడించారు.

అటల్ సేతు వంతెనలో 8 అద్భుతమైన ఇంజనీరింగ్ సాంకేతికతలు ఉన్నట్లు వివరించారు. భూకంపాలు సంభవిస్తే 6.5 తీవ్రత వరకూ ఇవి తట్టుకొని నిలబడతాయి. అధికశాతం స్టీల్ డెక్ లను ఉపయోగించడం వల్ల బరువు తక్కువ ఉంటుంది. కాంక్రీట్ కంటే కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. తక్కువ పిల్లర్లతో పొడవాటి రహదారులు ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.

ప్రత్యేకమైన రిగ్గులను ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణించేటపప్పుడు పెద్ద శబ్ధాలు రాకుండా నివారించవచ్చు. అలాగే వంతెన వైబ్రేషన్ కి గురికాకుండా ఉంటుంది. సముద్రంలోని జీవులకు ఎలాంటి అసౌకర్యం కలగదు.ఎకో ఫ్రెండ్లీ లైటింగ్ ను ఏర్పాటు చేయడం వల్ల తక్కువ ఖర్చు..అతి తక్కువ కరెంట్ వినియోగంతో మంచి వెలుగువచ్చేలా రూపొందించారు.

ఎలక్ట్రానిక్ టోల్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వాహనాలను నిలపాల్సిన పనిలేదు. ప్రయాణిస్తున్న క్రమంలోనే సెన్సార్లు ఆటోమేటిక్ గా టోల్ ఫీజులు కట్ చేసుకుంటాయి. వంతెనపై ఉన్న ట్రాఫిక్ సమాచారాన్ని వాహన డ్రైవర్లు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పెద్ద డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. రోడుపై జరిగిన ప్రమాదాలను కూడా ఇది సూచిస్తుంది.