
Rohit Sharmas ODI Future: టీమిండియా వన్డే టీం ఓపెనర్ రోహిత్ శర్మ ఫ్యూచర్పై సందిగ్ధంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఇందుకు సంబంధించి ఎన్నో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పీటీఐ నివేదిక ప్రకారం, భారత సెలక్షన్ కమిటీ రోహిత్ శర్మతో గతంలో మాట్లాడిందని, తమ ఫ్యూచర్ ప్రణాళికల్లో అతడు లేడని స్పష్టం చేసిందని తేలింది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని తీసుకున్నట్లు, యశస్వి జైస్వాల్ వంటి యువ బ్యాటర్లకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో జరిగిందని నివేదికలు సూచిస్తున్నాయి.

సెలెక్టర్ల ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ మొదట తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈక్రమంలో అగార్కర్, గంభీర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడంట. తన ఫిట్నెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని, అలాంటి నాపై ఇలా ప్రవర్తించడం దారుణం అంటూ క్లాస్ పీకేశాడంట. అయితే, సుదీర్ఘ చర్చల అనంతరం రోహిత్ చివరికి సెలెక్టర్ల ప్రణాళికకు అంగీకరించినట్లు పీటీఐ కథనం వివరించింది.

ఈ పరిణామాల నేపథ్యంలో, జులై 19న లార్డ్స్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మూడో వన్డేనే రోహిత్ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ కావచ్చని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు గుప్పుమన్నాయి. ఈ వార్తలు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకతను రేకెత్తించాయి. దీంతో బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెంటనే రంగంలోకి దిగి ఈ ఊహాగానాలకు తెరదింపారు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్ని ఖండించిన దేవజిత్ సైకియా, జట్టు ప్రణాళికల్లో ఉన్నంత కాలం రోహిత్ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడని స్పష్టం చేశారు.

ఈక్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తనపై వస్తున్న ఊహాగానాలకు బ్యాట్తోనే స్ట్రాంగ్ రిప్లై ఇచ్చాడు. కీలకమైన ఆ మ్యాచ్లో సెంచరీ సాధించి, తన రిటైర్మెంట్ చర్చలకు తెరదింపాడు. ఈ సంఘటనల నేపథ్యంలో, బీసీసీఐ సైతం రోహిత్ మాట్లాడిన ఒక వీడియోను విడుదల చేసింది. తన భవిష్యత్తుపై వస్తున్న వార్తలను రోహిత్ కొట్టిపారేసిన సంగతి తెలిసిందే.

ఆ వీడియోలో రోహిత్ మాట్లాడుతూ, "చూడండి, నా పని బ్యాట్ తోనే. మైదానంలోకి వచ్చి దేశం కోసం, జట్టు కోసం ఆడటం నా బాధ్యత. నేను అరంగేట్రం చేసినప్పటి నుంచి నాకు ఇదే చెప్పారు. నేను అదే చేస్తాను." అని పేర్కొన్నాడు. "నేను ఆడిన మొదటి మ్యాచ్ నుంచి ఎన్నో విమర్శలు వస్తూనే ఉన్నాయి. నేను ఆడుతున్నంత కాలం ఇది ఉంటూనే ఉంటుంది. కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకోను. నేను మైదానంలో ఏం చేస్తానన్నదే ముఖ్యం. జట్టు విజయానికి దోహదపడటమే నా లక్ష్యం." అని రోహిత్ వివరించాడు. ఈ వ్యాఖ్యలు రోహిత్ నిబద్ధతను, వృత్తి నైపుణ్యాన్ని స్పష్టం చేస్తూ, అతని భవిష్యత్తుపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేశాయి.