
తిరుపతి జిల్లాలోని సీఎం చంద్రబాబు నాయుడు సొంతూరు నారావారిపల్లిలో సంక్రాంతి సందడిగా సాగుతోంది. పెద్ద పండుగ సంక్రాంతి జరుపుకునేందుకు నారావారి పల్లికి వచ్చిన నారా, నందమూరి కుటుంబాలు నాలుగు రోజుల పాటు నారావారిపల్లి లోనే ఉండనున్నాయి. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీలు, సంప్రదాయ క్రీడల నిర్వహించగా.. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేసారు సిఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి..

నారావారిపల్లితో పాటు తిరుపతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. నారావారిపల్లిలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రం, 33/11 కెవి సెమీ ఇండోర్ సబ్ స్టేషన్ ప్రారంభించారు. ఎ.రంగంపేట భీమవరం వరకు నిర్మించిన నూతన సిసి రోడ్డు, సంజీవిని ప్రాజెక్టు ప్రారంభంతో పాటు మూలపల్లె ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు సీఎం. అనంతరం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ లో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్ పరిశోధన ల్యాబ్ ను వర్చువల్ గా సిఎం చంద్రబాబు ప్రారంభించారు.

సంక్రాంతి సంబరాలతో నారావారిపల్లి కోలాహలంగా మారింది. సంక్రాంతి సంబరాలలో నారా చంద్రబాబు కుటుంబ సభ్యులు పాల్గొని క్రీడలను ఆసక్తిగా తిలకించారు. సిఎం దంపతులు గ్రామస్థులతో సరదాగా గడిపారు. నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో రంగవల్లులు, ఆటల పోటీలు జరగ్గా.. గెలుపొందిన వారికి బహుమతుల ప్రదానం చేసారు సీఎం. ఇంటి వద్ద ప్రజల వద్ద నుంచి వినతులను కూడా సీఎం చంద్రబాబు స్వీకరించారు.

ఆటల పోటీలను సీఎం చంద్రబాబు, భువనేశ్వరి, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మిణి, ఎంపీ భరత్, ఆయన భార్య తేజస్విని, ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, శాప్ చైర్మన్ రవి నాయుడు, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తిలకించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాలబాలికలకు బహుమతుల పంపిణీ చేసారు.

గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ పండుగ వాతావరణం ఉట్టిపడేలా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. ఆటల్లో పాల్గొన్న లోకేష్ కొడుకు దేవాన్ష్, విశాఖ ఎంపీ భరత్ కొడుకు అందరినీ ఆకట్టుకున్నారు. పాటల పోటీలో గెలిచి తాత సీఎం చంద్రబాబు చేతుల మీదుగా బహుమతులను అందుకున్నారు.