ఏ సినిమాకు ఆ సినిమా లెక్కా పత్రాలు చూసుకునే రోజులు లేవిప్పుడు. పోయిన సారి ఏం జరిగింది? ఈ సారి దాని ఇంపాక్ట్ ఏంటి? అని మాట్లాడుకుంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇంతకీ పూరి జగన్నాథ్ విషయంలో పోయిన సారి ఏం జరిగింది? అది ఈ సారి ఎలా ఇంపాక్ట్ కనిపిస్తోంది. ఈ టైమ్లో పూరి ఎలా స్పందిస్తారు? తగ్గుతారా? తగ్గితేనే నెగ్గుతారా? పూరికి ఇంకా లైగర్ తలనొప్పి తగ్గలేదా? అసలేం జరుగుతోంది? లెట్స్ వాచ్...
పూరి జగన్నాథ్ కెరీర్లో ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన కిక్ మామూలుది కాదు. రామ్కి లైఫ్లో ఇమేజ్ టర్నింగ్ సినిమా అయింది. అప్పటిదాకా అలా.. అలా సాగుతున్న పూరి కెరీర్ ఉన్నపళాన స్పీడందుకుంది. ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీనుతో పూరికి మంచి రిలేషన్ కుదిరింది. ఆ రిలేషన్తోనే లైగర్ మూవీని కూడా వరంగల్ శీనుకే ఇచ్చారు పూరి.
ఇస్మార్ట్ శంకర్ సీన్ లైగర్ విషయంలో రిపీట్ కాలేదు. ఎగ్జిబిటర్లు లాస్ లు చూశారు. ఈ విషయం పూరి దాకా చేరింది. సీన్ కట్ చేస్తే వరంగల్ శీను... పూరి ముందు నిలుచున్నారు. అప్పుడు జరిగిన మాటల ప్రకారం లావాదేవీలు పూర్తయ్యాయి. అయితే ఆ మొత్తాన్ని వరంగల్ శ్రీను ఎగ్జిబిటర్స్ కి ఇవ్వలేదట. ఎగ్జిబిటర్స్ కి ఇప్పటికీ శ్రీను... దాదాపు 8 కోట్లు బకాయిలు ఉన్నారట. అయితే లీగల్గా ఆధారాలు లేకపోవడంతో ఎగ్జిబిటర్లు కిమ్మనకుండా ఉండిపోయారు.
అప్పటి కోపాన్ని ఇప్పుడు నైజామ్ ఎగ్జిబిటర్లు తీర్చుకోవాలనుకుంటున్నారు. రిలీజ్కి రెడీ అవుతున్న పూరి సినిమా డబుల్ ఇస్మార్ట్ మీద సీతకన్నేశారు. థియేటర్లను సర్దుబాటు చేసి, డబుల్ ఇస్మార్ట్ కి దారి ఇవ్వడానికి ఎవ్వరూ సుముఖంగా లేరు. లైన్లో ఉన్న మిస్టర్ బచ్చన్, తంగలాన్ కి థియేటర్లు కేటాయించడానికే మొగ్గుచూపుతున్నారు. తాము నష్టపోయినప్పుడు పట్టించుకోని వ్యక్తి కోసం ఇప్పుడు తామెందుకు ముందుకు రావాలన్న మాట వినిపిస్తోంది.
డబుల్ ఇస్మార్ట్ ని పూరి జగన్నాథ్ సోలోగా రిలీజ్ చేసి ఉంటే, ఎగ్జిబిటర్ల నుంచి ఈ రకమైన మాటలు వినిపించకపోయేవి. కానీ ఇప్పుడు ఆగస్టు 15 బరిలో చాలా సినిమాలే ఉన్నాయి. అందుకే ఎగ్జిబిటర్ల మాట నెగ్గుతోంది. ఈ టైమ్లో పూరి వాళ్లతో కూర్చుని చర్చలు జరిపి సామరస్యంగా ముందుకు సాగుతారా? లేకుంటే తనదైన మార్గంలో మనసుకు నచ్చినట్టే చేస్తారా? పూరి డెసిషన్ మీదే డబుల్ ఇస్మార్ట్ నైజామ్ కెరీర్ ముడిపడిందన్నది మాత్రం వాస్తవం.