కనిపించట్లేదు కానీ.. టాలీవుడ్లో చాలా మంది మీడియం రేంజ్ హీరోలు హిట్టు కోసం పెద్ద యుద్ధమే చేస్తున్నారు. ఒక్కరో ఇద్దరో కాదు.. రామ్, విజయ్ దేవరకొండ, నాగ చైతన్య, అఖిల్, శర్వానంద్, నితిన్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా భారీగానే ఉంటుంది. వీళ్లంతా హిట్ కొట్టి కొన్నేళ్ళవుతుంది. అందరూ నెక్ట్స్ సినిమాలతో బాక్సాఫీస్ షేక్ చేయాలని చూస్తున్నారు.
నాగ చైతన్యనే తీసుకోండి.. లవ్ స్టోరీ తర్వాత ఈయనకు సక్సెస్ లేదు. థ్యాంక్యూ, కస్టడీ దారుణంగా నిరాశ పరిచాయి. కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి తెరకెక్కిస్తున్న తండేల్పైనే చైతూ ఆశలన్నీ ఉన్నాయి. ఇది ఆయన తోలి పాన్ ఇండియా చిత్రం.
గోపీచంద్ హిట్ కొట్టి దశాబ్ధం అవుతుంది. మొన్నటి భీమా కూడా వర్కవుట్ అవ్వలేదు. ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సైతం సరైన బ్లాక్బస్టర్ కోసం చూస్తున్నారు. ఫ్యామిలీ స్టార్తో ఎప్రిల్ 5న వచ్చేస్తున్నారీయన.
శర్వానంద్ కూడా కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒకే ఒక జీవితం ఓకే అనిపించినా బ్లాక్బస్టర్ కాదు. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో మనమే సినిమాలో నటిస్తున్నారు శర్వా.
అలాగే నితిన్, రామ్, అఖిల్, కళ్యాణ్ రామ్, రవితేజ లాంటి హీరోలు సైతం ఒక్క హిట్ కోసం దండయాత్ర చేస్తూనే ఉన్నారు. వీళ్లందరూ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేదెప్పుడో చూడాలి. ప్రస్తుతం నితిన్ రాబిన్ హుడ్, రామ్ డబల్ ఇస్మార్ట్ సినిమాల్లో చేస్తున్నారు.