
తన గొంతుకతో ప్రజలను చైతన్యవంతులను చేసి పెత్తందార్ల గుండెల్లో గుణపాలు దించి.. పాటతో కోట్లాడి పీడిత ప్రజల జీవితాల్లో కదలిక తెచ్చిన గద్దర్ (74) ఇకలేరు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఆదివారం (ఆగస్టు 6) అమీర్పేట్లోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.


2 రోజుల క్రితం అంటే జులై 20న తీవ్రమైన ఛాతినొప్పితో అపోలోలో చేరగా.. ఆగస్టు 3న బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయినట్లు వైద్యులు కూడా ప్రకటించారు. కానీ అంతలోనే ఆయన మృతిచెందడం పట్ల పలువురిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు గద్దర్ మృతికి గల కారణాలను తాజాగా వెల్లడించారు.

ఊపిరితిత్తులు, యూరినరీ సమస్యలతో గద్దర్ ఎప్పటి నుంచో బాధపడుతున్నారు. ఈ అనారోగ్య సమస్యల నుంచి కోలుకోలేకపోవడంతో గద్దర్ ఆరోగ్యం మరింత క్షీణించి మృతి చెందినట్లు వైద్యులు తాజా బులెటిన్లో వెల్లడించారు. గద్దర్ మరణ వార్త తెలియగానే సికింద్రాబాద్ భూదేవి నగర్లోని ఆయన నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివస్తున్నారు. ప్రజా యుద్ధనౌకగా పేరుగాంచిన గద్దర్ తెలంగాణ ఉద్యమ కాలంలో తన గొంతుకతో ఉద్యమానికి ఊపిరిపోశారు. పీపుల్స్ వార్, అనంతరం మావోయిస్టు, తెలంగాణ ఉద్యమాల్లో కోట్ల మంది ప్రజలను చైతన్యపరిచారు. కాగా గద్దర్కు భార్య, సూర్యుడు, చంద్రుడు, వెన్నెల అనే ముగ్గురు సంతానం ఉన్నారు.

గద్దర్ పాడిన పాటల్లో ‘అమ్మ తెలంగాణమా’, ‘పొడుస్తున్న పొద్దుమీద’ వంటి పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ‘మాభూమి’ సినిమాలో గద్దర్ పాడిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమా..’ అనే పాటకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఐతే ఆ అవార్డును ఆయన తిరస్కరించారు.