ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు కన్నుమూశారు. మూడు రోజుల క్రితం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేశారు. ఆ తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయింది. రెండు రోజుగా తీవ్ర అస్వస్థతతో వెంటిలేటర్ పై వైద్య చికిత్స పొందుతూనే ఆయన తుది శ్వాస విడిచారు. ఈ రోజు తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకు ఆయన కన్నుమూశారు. రామోజీ ఫిల్మ్సిటీలోని నివాసానికి పార్థివదేహం తరలించారు.
1936 నవంబర్ 16న కృష్ణాజిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. 2016లో రామోజీరావుకు భారత రెండో అత్యున్నత పద్మవిభూషణ్ పురస్కారం లభించింది. రామోజీరావు అసలు పేరు చెరుకూరి రామయ్య. ఈటీవీ అధినేతగా...పత్రికా సంపాదకులుగా...ప్రచురణకర్తగా..సినీ నిర్మాత, వ్యాపారవేత్తగా పేరుప్రఖ్యాతులు సంపాదించారు రామోజీరావు. గుడివాడలోనే పాఠశాల విద్య, ఇంటర్, డిగ్రీ చదివారు రామోజీరావు.
రామోజీ గ్రూప్లో ఈనాడు మీడియా, మార్గదర్శి చిట్ఫండ్స్, ప్రియా ఫుడ్స్, ఉషాకిరణ్ మూవీస్, రామోజీ ఫిల్మ్సిటీ, కళాంజలి, బ్రిసా షోరూమ్స్ వంటి సంస్థలున్నాయి. తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్రవేశారు రామోజీరావు.
1962లో మార్గదర్శి చిట్ఫండ్స్ స్థాపించిన రామోజీరావు..వ్యాపారంలోను ముందుకెళ్లారు. 1974 ఆగస్ట్ 10న విశాఖ వేదికగా ఈనాడు పత్రికను ప్రారంభించారు. ఈటీవీ పేరుతో 8 భాషల్లో ఛానెల్స్ను తీసుకొచ్చారు రామోజీరావు. ఉషాకిరణ్ మూవీస్ కింద 20వరకు సినిమాలు నిర్మించారు రామోజీరావు.
రామోజీరావు అస్తమయంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామోజీరావు తెలుగు వెలుగు.. ఆయన మృతి తీరని లోటు అన్నారు. రామోజీరావు మృతి తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు చంద్రబాబు. అక్షర యోధుడు రామోజీరావు సేవలు ఎనలేనివన్నారు చంద్రబాబు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ రానున్న చంద్రబాబు..మధ్యాహ్నం ఫిల్మ్సిటీకి వెళ్లనున్నారు.
రామోజీరావు మృతికి సీఎం రేవంత్రెడ్డి సంతాపం తెలిపారు. రామోజీరావు మరణం తెలుగు పత్రికా రంగానికి..మీడియా, వ్యాపార రంగాలకు తీరని లోటు అన్నారు. అక్షర వీరుడు రామోజీరావు ఆత్మకు శాంతి కలగాలని కోరారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
రామోజీరావు మృతికి కేసీఆర్ సంతాపం తెలిపారు. వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యవస్థాపకుడిగా..రామోజీరావు ఎనలేని సేవలందించారన్నారు కేసీఆర్ రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు కేసీఆర్.
రామోజీరావు మృతిపట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందన్నారు. ఓం శాంతి అంటూ చిరంజీవి సంతాపం తెలిపారు. రామోజీరావు వ్యక్తి కాదు.. శక్తివంతమైన వ్యవస్థ అన్నారు భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. రామోజీరావు జీవితం అందరికీ ఆదర్శమన్నారు కేశినేని చిన్ని. వ్యక్తిగతంగా ఆప్తమిత్రుడిని కోల్పోయానన్నారు జయప్రకాష్ నారాయణ.
రామోజీరావు మరణంపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. రామోజీ మరణం బాధాకరమన్నారు మోదీ. భారత మీడియాలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన విజనరీ అన్నారు. జర్నలిజానికి, సినిమాలకు రామోజీ అద్భుత సేవలందించారన్నారు. మీడియాలోనూ, వినోద రంగంలోనూ సృజనాత్మకతకు పెద్దపీట వేశారన్నారు. భారత అభివృద్ధి కోసం రామోజీరావు పరితపించారని...ఆయన్ను పలుమార్లు కలుసుకునే సందర్భం వచ్చిందన్నారు మోదీ. రామోజీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, అభిమానులకు సంతాపం తెలిపారు మోదీ
రామోజీరావుకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచే సీఎస్కు సీఎం రేవంత్రెడ్డి ఆదేశమిచ్చారు. ఏర్పాట్లు పర్యవేక్షించాలని సైబరాబాద్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు సైబరాబాద్ కమిషనర్.