
అల్లరి నరేష్ పేరుతో అల్లరి దూరమై మూడేళ్లైపోయింది. తనకు తానే బోర్ కొట్టేసి.. సీరియస్ కథల వైపు అడుగులు వేసారు నరేష్. అందులో విజయం కూడా సాధించారు.

మరి ఈయన ఇప్పటికీ అదే ధ్యాసలో ఉన్నారా..? సీరియస్ కథలే చేయాలని ఫిక్సైపోయారా..? తాజాగా మొదలైన సినిమా సంగతేంటి..? అందులోనూ సీరియస్ రోల్ చేస్తున్నారా లేదంటే మళ్లీ కామెడీ వైపు అడుగేస్తున్నారా..?

అల్లరి నరేష్ అంటే ప్రేక్షకులకు వెంటనే గుర్తుకొచ్చేది కామెడీ. 20 ఏళ్ళుగా ఆయనందించిన ఎంటర్టైన్మెంట్ అంత బలంగా ఉంది మరి. కానీ వరసగా కామెడీ చేస్తూ పోతే.. చూసేవాళ్లకే కాదు చేసేవాడికి కూడా బోర్ కొడుతుంది.

అందుకే మూడేళ్లుగా తన స్టైల్ మార్చుకున్నారు నరేష్. నాందీ నుంచి కథల ఎంపికలో మార్పు మొదలైంది. అప్పట్నుంచి సీరియస్ డ్రామాల వైపు ఆసక్తి చూపిస్తున్నారీయన.

నాందీ కంటే ముందే మహేష్ బాబు మహర్షి సినిమాలోనూ సీరియస్గా ఉండే పాత్రే చేసారు నరేష్. ఆ పాత్రకు వచ్చిన రెస్పాన్స్ చూసాకే.. అలాంటి కారెక్టర్స్ వైపు అడుగులేస్తున్నారు నరేష్. నాందీ హిట్ తర్వాత.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంతో వచ్చారు.

అయితే అది నిరాశ పరిచినా.. నటుడిగా ఫెయిల్ కాలేదు నరేష్. చాలా రోజుల తర్వాత మళ్లీ ఎంటర్టైన్మెంట్ ట్రాక్ ఎక్కుతున్నారు అల్లరోడు. సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుబ్బుతో నరేష్ ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు.

ఇది ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్టైనర్. దీనికి బచ్చల మల్లి అనే ఆసక్తికరమైన టైటిల్ పెట్టారు. తాజాగా ఈ చిత్ర ఓపెనింగ్ జరిగింది. ఇది కానీ హిట్టైందంటే.. నరేష్ను మళ్లీ ఎంటర్టైన్మెంట్ కథల్లో చూడొచ్చు. మొత్తానికి చూడాలిక.. అల్లరి నరేష్ కెరీర్ ఎలాంటి టర్న్ తీసుకోబోతుందో..?