ముంబాయిలో కురుస్తున్న కుండపోత వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మరోవైపు రవాణా సౌకర్యాలు లేక ప్రజల ఇబ్బందులు అన్నీఇన్నీకావు. ఇదిలా ఉంటే విపరీతంగా కురుస్తున్న వర్షాలతో రైళ్లు కూడా సమయానికి రావడం లేదు. ఈ పరిస్థితిలో ఓ మహిళ ముంబాయి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్పైనే మగబిడ్డకు జన్మనిచ్చింది.
ముంబాయి డాంబివ్లీ రైల్వే స్టేషన్లో ఈ ఘటన జరిగింది. అయితే బుధవారం ఉదయం రైల్వే స్టేషన్ పూర్తిగా జనంతో రద్దీగా మారడంతో తను ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. విపరీతమైన నొప్పులు రావడంతో ఆ మహిళ అక్కడే మగబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబాయి రైల్వే స్టేషన్లన్నీ జనం కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం ఉదయం మామూలు రోజులకంటే అధికంగా ప్రయాణికులతో ప్లాట్ఫామ్స్ కిటకిటలాడాయి. వర్షం ప్రభావంతో రైళ్ల రాక ఆలస్యమవుతోంది. మరోవైపు పలు రైళ్ల రాకపోకలను కూడా రైల్వేశాఖ రద్దు చేసింది.