
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడివేడిగా ప్రారంభం కాబోతున్నాయి. వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు సమావేశాలు జరుగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారిగా ఉభయ సభలు సమావేశమవుతున్నాయి. 21 రోజులపాటు జరుగనున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి.
సోమవారం నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఇండి కూటమి నేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 10 పార్టీల నేతలు హాజరయ్యారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రాన్ని పార్లమెంట్ సమావేశాల్లో నిలదీయాలని ఇండి కూటమి నేతలు నిర్ణయించారు. ఆపరేషన్ సింధూర్పై కేంద్రం ఇప్పటికి కూడా వాస్తవాలు వెల్లడించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బిహార్లో ఓటర్ల జాబితా సవరణపై కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని విపక్ష నేతలు వెల్లడించారు. విదేశాంగ విధానంపై ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు.
మరోవైపు ఆపరేషన్ సింధూర్పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ రాజుకుంది. చాలా యుద్దాలను తాను ఆపినట్టు ట్రంప్ ప్రకటించుకున్నారు. లేదంటే రెండు దేశాల మధ్య న్యూక్లియర్ వార్ జరిగేదన్నారు. అంతేకాకుండా యుద్దంలో ఐదు ఫైటర్ జెట్స్ను కూల్చేశారని అన్నారు ట్రంప్. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారు.
ట్రంప్ మాటలను ట్వీట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీ. ఐదు యుద్ద విమానాలు కూలిపోయాయని ట్రంప్ అంటున్నారని , దేశ ప్రజలు దీనిపై స్పష్టత కోరుకుంటున్నారని రాహుల్ ట్వీట్ చేశారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ , కాంగ్రెస్ ఎంపీల మధ్య మాటలయుద్దం మరింత ముదిరే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇండి కూటమి సమావేశానికి ఆప్ ఎంపీలు హాజరుకాలేదు. ఇండి కూటమితో తమకు సంబంధం లేదని , పార్లమెంట్ వరకే తమకు పొత్తు ఉందని , కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో 8 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. ఈ సందర్భంగా ఏడు పెండింగ్ బిల్లులతోపాటు 8 కొత్త బిల్లులను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ బిల్లు, జియోహెరిటేజ్ సైట్స్, జియో రెలిక్స్ (సంరక్షణ, నిర్హణ) బిల్లు, మైన్స్ అండ్ మినరల్స్ (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లు, నేషనల్ యాండీ డోపింగ్ (సవరణ) బిల్లు, మణిపూర్ వస్తు సేవల పన్ను (సవరణ) బిల్లు వంటివి ఇందులో ఉన్నాయి. వీటితోపాటు ఇన్కం ట్యాక్స్-2025 బిల్లును కూడా కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. విపక్షం లేవనెత్తే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తామని కేంద్రమంత్రులు స్పష్టం చేస్తున్నారు.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాలలోనే పార్లమెంటు ముందుకు రానుంది. వర్షాకాల సమావేశాల సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో మాక్డ్రిల్ నిర్వహించారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.