
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లో కొత్త చట్టాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వికసిత్ భారత్ రోజ్ గార్ ఔర్ ఆజివిక మిషన్ గ్రామీణ్ (వీబీ–జీ రామ్జీ) చట్టానికి పార్లమెంట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రపతి కూడా ఈ బిల్లును ఆమోదించారు. దీంతో ఇకపై మహాత్మాగాంధీ ఉపాధి హామీ పేరుకు బదులు వికసిత్ భారత్ రోజ్గార్, అజీవికా హామీ మిషన్ (గ్రామీణ్) పేరుతో ఈ పథకం అమలు కానుంది. కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆ పేరుతో ఈ పథకం అమలు చేయాలని కేంద్రం ఇప్పటికే నిర్ణయించింది. పేరు మార్పుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తుండగా.. కేంద్ర తిప్పికొడుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై జరుగుతున్న ప్రచారాలపై క్లారిటీ ఇచ్చి ప్రజల అనుమానాలను తొలగించింది.
కొత్త చట్టంతో పని హక్కును కోల్పోతారనే వాదనలు ప్రతిపక్షాల నుంచి వస్తున్నాయి. అలాగే పని చేసినవారికి జీతం చెల్లింపు, నిరుద్యోగ భృతి వంటి విషయాలపై పలు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వీటిపై తాజాగా క్లారిటీ ఇస్తూ కేంద్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ఉపాధి హామీపై ఎలాంటి పరిమితులు లేవని, ఎలాంటి అగ్రికల్చర్ సీజన్ బేస్డ్ పరిమితులు విధించలేదని స్పష్టం చేసింది. నైపుణ్యం లేని, శారీరక శ్రమ చేయడానికి స్వచ్చంధంగా ముందుకొచ్చే ప్రతీ గ్రామీణ కుటుంబానికి ప్రతీ ఆర్ధిక సంవత్సరంలో తప్పనిసరిగా 125 రోజుల పని కల్పిస్తామని తెలిపింది. విత్తనాలు వేసే, కోత కోసే కీలక సమయాల్లో వ్యవసాయ కూలీల అవసరం ఉన్నందున ఏడాదిలో 60 రోజుల పాటు పని లేని కాలం ఉంటుందని, మిగిలిన 305 రోజుల్లో 125 రోజుల పాటు లబ్దిదారులు పని చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
ఏడాదిలో 125 రోజుల పని ఖచ్చితంగా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. పని కోరిన 15 రోజుల్లోగా ఉపాధి కల్పించాలని, లేని పక్షంలో నిరుద్యోగ భృతి తప్పనిసరిగా చెల్లిస్తామని తెలిపింది. పని చేసిన ప్రతీ వ్యక్తికి నోటిఫైడ్ వేతన రేటు ప్రకారం చెల్లింపులు జరుగుతాయిన తెలిపింది. కొత్త చట్టం ప్రకారం ప్రతీ ఏటా వేతన రేట్లు నోటిఫై చేస్తామని వెల్లడించింది. పాత చట్టంలో కంటే కొత్త చట్టంలో వేతన రేట్లు ఎక్కువగా ఉంటాయని ప్రకటించింది. వారానికి ఒకసారి లేదా 15 రోజుల్లోగా పనిచేసిన వారికి అకౌంట్లో నిధులు జమ చేస్తామని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారం కాకుండా 60:40 నిష్పత్తిలో భాగస్వామ్యం ఉంటుందని, ఈశాన్య, హిమాలయ రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో అమలు జరుగుతుందని కేంద్రం పేర్కొంది.