Lance Naik Manju: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఆమె.. భారత సైన్యంలో ఫస్ట్ ఉమెన్ స్కైడైవర్‌గా రికార్డ్..

|

Nov 19, 2022 | 8:18 PM

స్కైడైవ్ పూర్తి చేసిన తర్వాత.. లాన్స్ నాయక్ మంజు స్పందిస్తూ.. "పక్షి తన రెక్కలను విశ్వసించడం నేర్చుకున్నప్పుడు అది ఎగరగలదు.. యువత తమ కలలను నిజం చేసుకోవడానికి ఎంత గట్టిగా ప్రయత్నిస్తారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందన్నారు.

Lance Naik Manju: ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న ఆమె.. భారత సైన్యంలో ఫస్ట్ ఉమెన్ స్కైడైవర్‌గా రికార్డ్..
Lance Naik Manju
Follow us on

మహిళ ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం.. అన్నింటా సగం.. కొంచెం చేయి అందించి చూడు.. నిన్ను మించి ప్రతిభను చూపిస్తారు.. ఇల్లాలిగా భద్యతలు నిర్వహిస్తూనే తనదైన ప్రతిభను చూపిస్తారు. అంబరాన్ని అందుకుంటారు.. సముద్రం లోతులను కొలిచేస్తారు.. తాజాగా కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ నుండి ఈస్టర్న్ కమాండ్‌కు చెందిన లాన్స్ నాయక్ మంజు భారత సైన్యంలో మొదటి మహిళా స్కైడైవర్‌గా చరిత్ర సృష్టించారు. ఇదే విషయంపై ఆర్మీ ఈస్ట్రన్‌ కమాండ్‌ నవంబర్ 16, 2022న సోషల్ మీడియాలో షేర్ చేసింది. లాన్స్ నాయక్ మంజు ఈ స్ఫూర్తిదాయకమైన చర్య దేశంలోని ఇతర మహిళలకు కూడా ఆదర్శంగా నిలుస్తుందని తూర్పు కమాండ్ ట్వీట్‌లో పేర్కొంది.

లాన్స్ నాయక్ మంజు కార్ప్స్ ఆఫ్ మిలిటరీ పోలీస్ విభాగంలో పనిచేస్తున్నారు. స్కైడైవింగ్ కోసం ఇండియన్ ఆర్మీ అడ్వెంచర్ వింగ్‌కు చెందిన స్కైడైవింగ్ ట్రైనింగ్ టీమ్ నుంచి మంజు శిక్షణ తీసుకున్నారు. 10వేల అడుగుల ఎత్తులో వెళ్తున్న తేలికపాటి హెలికాప్టర్‌ ధ్రువ్‌ నుంచి డైవింగ్‌ చేసి సైన్యంలో మొదటి మహిళా స్కై డైవర్‌గా లాన్స్‌ నాయక్‌ మంజు రికార్డు సృష్టించారు. స్కైడైవ్ పూర్తి చేసిన తర్వాత..  లాన్స్ నాయక్ మంజు స్పందిస్తూ.. “పక్షి తన రెక్కలను విశ్వసించడం నేర్చుకున్నప్పుడు అది ఎగరగలదు.. యువత తమ కలలను నిజం చేసుకోవడానికి ఎంత గట్టిగా ప్రయత్నిస్తారనే దానిపైనే విజయం ఆధారపడి ఉంటుందన్నారు.

ఇవి కూడా చదవండి

భారత సైన్యంలో మహిళలు
గత కొంతకాలంగా భారత సాయుధ దళాల అన్ని విభాగాలలో మహిళలు విధులను నిర్వహిస్తూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలోనే కెప్టెన్‌ అభిలాష బరాక్‌ ఆర్మీ ఏవియేషన్‌లో మొదటి మహిళా ఆఫీసర్‌గా నియమించబడ్డారు. అంతేకాదు గత ఏడాది ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో మాయ సుదన్‌ మొదటి మహిళా ఫైటర్‌ పైలట్‌గా బాధ్యత స్వీకరించారు.  ఫ్లయిట్‌ లెఫ్టినెంట్‌ హినా జైస్వాల్‌ మొదటి మహిళా ఫ్లయిట్‌ ఇంజనీర్‌గా చరిత్ర సృష్టించారు. 2020 నాటికి  ముగ్గురు మహిళా అధికారులకు లెఫ్టినెంట్ జనరల్ లేదా తత్సమాన ర్యాంక్ మంజూరు చేయబడింది. వీరంతా వైద్య సేవలకు చెందిన వారు. మే 2021లో, భారత సైన్యంలో మొదటిసారిగా 83 మంది మహిళలు జవాన్లుగా నియమింపబడ్డారు. వీరిని కార్ప్స్ ఆఫ్ మిలిటరీ సర్వీస్‌లోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..