
భారతదేశ మౌలిక సదుపాయాల రంగంలో ఒక అద్భుతమైన చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. కాశ్మీర్, లడఖ్ మధ్య దశాబ్దాల నాటి సర్వకాలీన అనుసంధానత కల నెరవేరింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలను కలిపే అత్యంత ప్రతిష్టాత్మక ‘జోజిలా టన్నెల్’ (Zojila Tunnel) ప్రాజెక్ట్ ఫైనల్ బ్రేక్ త్రూను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధికారికంగా ప్రారంభించారు. దేశ రక్షణ రంగంతో పాటు పౌర రవాణాలో సరికొత్త విప్లవానికి ఈ ప్రాజెక్ట్ వేదికగా నిలిచింది.
సముద్ర మట్టానికి ఏకంగా 11,578 అడుగుల అసాధారణ ఎత్తులో నిర్మించిన ఈ సొరంగం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న ‘అతి పొడవైన సింగిల్-ట్యూబ్ బై-డైరెక్షనల్’ టన్నెల్గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రధాన సొరంగం పొడవు 13.153 కిలోమీటర్లు కాగా, అప్రోచ్ రోడ్లు, ఇతర అనుబంధ నిర్మాణాలతో కలిపి మొత్తం ప్రాజెక్ట్ పొడవు 30.894 కిలోమీటర్లుగా ఉంది. వెర్టికల్ షాప్ట్లు, నిల్గ్రార్ జంట సొరంగాలు, మంచు తాకిడిని తట్టుకునే ‘స్నో గ్యాలరీలు’ ఈ ప్రాజెక్ట్లో కీలక నిర్మాణాలుగా నిలిచాయి.
గతంలో శీతాకాలంలో సంభవించే భారీ మంచు తుఫానులు, కొండచరియలు విరిగిపడటం వల్ల జోజిలా పాస్ పూర్తిగా మూసుకుపోయేది. ఫలితంగా లడఖ్ ప్రాంతం ఏటా దాదాపు ఆరు నెలల పాటు దేశంలోని మిగతా భాగాలతో సంబంధాలు తెగిపోయి బాహ్య ప్రపంచంతో కట్ అయిపోయేది. ఇకపై ఈ జోజిలా టన్నెల్ ద్వారా శ్రీనగర్ – లడఖ్ మధ్య ఏడాదిలో 365 రోజులూ నిరంతరాయంగా, సురక్షితంగా రాకపోకలు సాగించడం సాధ్యమవుతుంది.
చైనా, పాకిస్థాన్ సరిహద్దులకు ఆనుకుని ఉండే ద్రాస్, కార్గిల్, లేహ్ వంటి వ్యూహాత్మక, సున్నితమైన సరిహద్దు ప్రాంతాలకు ఈ టన్నెల్ ఒక రక్షణ కవచంలా మారనుంది. శీతాకాలంలో కూడా భారత సైన్యాన్ని, భారీ యుద్ధ సామాగ్రిని, లాజిస్టిక్స్ సామగ్రిని ఎలాంటి ఆటంకాలు లేకుండా సరిహద్దులకు తరలించడానికి ఇది సైన్యానికి ఎంతో కీలకంగా మారనుంది.
మేఘా ఇంజనీరింగ్ అంకితభావం.. అధిగమించిన సవాళ్లు
నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NHIDCL) పర్యవేక్షణలో.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ మౌలిక వసతుల సంస్థ ‘మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్’ (MEIL) ఈ అత్యంత క్లిష్టమైన ప్రాజెక్ట్ను చేపట్టింది. ‘న్యూ అస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్’ (NATM) అనే అత్యాధునిక సాంకేతికతతో ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఈ టన్నెల్ నిర్మాణ కాలంలో ప్రకృతి సృష్టించిన సవాళ్లు అన్నీ ఇన్నీ కావు.
మైనస్ 20 డిగ్రీల గడ్డకట్టే ఉష్ణోగ్రతల్లో సైతం 1200 మందికి పైగా కార్మికులు ఆధునిక పరికరాలతో రాత్రింబగళ్లు శ్రమించారు. గత ఐదేళ్లలో ఈ ప్రాంతంలో 5 భారీ హిమపాతాలు సంభవించినా మేఘా సంస్థ వెనుకడుగు వేయలేదు. మూడేళ్ల కిందట భారీ హిమపాతంలో చిక్కుకున్న 172 మంది కార్మికులను భారత సైన్యం ప్రాణాలకు తెగించి సురక్షితంగా రక్షించింది. టన్నెల్ తవ్వే మార్గంలో రాతి పొరల స్వభావం ఏకంగా 67 సార్లు మారినా, ఇంజనీర్లు పట్టుదలతో అధిగమించారు.
అమర్నాథ్ యాత్రికులకు వసతులు
ఈ ప్రాజెక్ట్ అందుబాటులోకి రావడం వల్ల లడఖ్ ప్రాంతంలో పర్యాటక రంగం, స్థానిక ఆర్థిక కార్యకలాపాలు అపూర్వమైన రీతిలో ఊపందుకోనున్నాయి. స్థానిక ప్రజల దశాబ్దాల నాటి రవాణా కష్టాలు శాశ్వతంగా తీరిపోనున్నాయి. వీటితో పాటు అమర్నాథ్ యాత్రికుల సౌకర్యార్థం ఈ మార్గంలో ప్రత్యేక పార్కింగ్ ప్లేస్లు, అత్యవసర వైద్య సదుపాయాలు అధునాతన మౌలిక వసతులను కూడా కల్పించారు.
ఇది కేవలం ఒక రహదారి లేదా సొరంగం మాత్రమే కాదు, అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులను సవాల్ చేస్తూ భారతీయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి, దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుత కట్టడం అని నిపుణులు కొనియాడుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
📍𝐙𝐨𝐣𝐢𝐥𝐚 𝐄𝐚𝐬𝐭𝐞𝐫𝐧 𝐏𝐨𝐫𝐭𝐚𝐥 | Live from Breakthrough Ceremony of the Zojila Tunnel & Press Conference #ZojilaTunnel #AllWeatherRoad #TunnelBreakthrough #PragatiKaHighway #GatiShakti #BuildingTheNation https://t.co/MiKC4jBdXZ
— Nitin Gadkari (@nitin_gadkari) June 9, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..