
జమ్ముకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంబన్ జిల్లాలో ఓ లోయలో పర్యాటకుల బస్సు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉఖ్రాల్ పోగల్ పారిస్థాన్ తహసీల్ ప్రాంతంలో టాటా సుమో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం శుక్రవారం రాత్రి చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు.
రన్నింగ్లో ఉన్న టాటా సుమో వాహనం సుమో అదుపు తప్పి 600 అడుగుల లోతైన లోయలోకి పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు.. వారిని ఉఖ్రాల్ ప్రాథమిక హెల్త్ సెంటర్కు తరలించినట్లు ప్రకటించారు. వారిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మిగతా నలుగురిని ఎస్డీహెచ్ బనిహాల్కు తరలించినట్లు చెప్పారు. అక్కడ చికిత్స పొందుతూ మరో ముగ్గురు కూడా మరణించినట్లు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
తొలుత ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వాహనంలో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేశారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. సహాయక చర్యలు చేపట్టారు. వాహనంలో చిక్కున్న మృతదేహాలను బయటకు తీశారు. గాయాలపాలయిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేస్తున్నారు. లింక్ రోడ్డు అయినా లేదా జాతీయ రహదారి అయినా వాటిపై జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పర్యాటకులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. తొందరపడకుండా పూర్తి సంయమనంతో డ్రైవ్ చేయాలని సూచించారు. వాహనం ఫిట్నెస్పై ఎల్లప్పుడూ శ్రద్ధ వహించాలని, తద్వారా ఈ రకమైన ప్రమాదాలబారిన పడకుండా ఉంటుదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.