పుణేలో ప్రభుత్వ లగ్జరీ సౌకర్యాల కోసం.. మితిమీరి ప్రవర్తించి వివాదంలో ఇరుక్కుకున్న ట్రెయినీ కలెక్టర్ పూజా ఖేద్కర్కు సంబంధించి మరిన్ని సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఉద్యోగం కోసం ఓబీసీ సర్టిఫికేట్తో పాటు కంటి, మానసిక సంబంధమైన కొన్ని సమస్యలున్నట్లు తప్పుడు పత్రాలు సమర్పించినట్టు ఆరోపణలు వచ్చాయి. నకిలీ అంగవైకల్యం సర్టిఫికేట్తో ఆమె ఉద్యోగం పొందారా ? అన్న విషయంపై కూడా సందేహాలు కలుగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రధాని కార్యాలయం ఇప్పటికే దర్యాప్తుకు ఆదేశించింది. ఆమె సమస్యలను నిర్ధారించే పరీక్షలకు ఆమె ఆరుసార్లు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది.
పూజా ఖేద్కర్ను పుణే నుంచి వాశిమ్ అసిస్టెంట్ కలెక్టర్గా బదిలీ చేశారు. సివిల్స్లో 841 ర్యాంక్ వచ్చినప్పటికి ఓబీసీ సర్టిఫికేట్ తోనే ఆమె ఐఏఎస్కు ఎంపికయ్యారు. పూజా తండ్రి మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. క్రిమీలేయర్ కిందకు రావడంతో ఆమెకు ఓబీసీ రిజర్వేషన్ వర్తించదన్న వాదన కూడా ఉంది.
పుణేలో అసిస్టెంట్ కలెక్ట్కర్గా ఉద్యోగంలో చేరకముందే తనకు ఎన్నో సౌకర్యాలు కావాలని పూజా డిమాండ్ చేయడంతో వివాదం చెలరేగింది. తన ప్రైవేట్ ఆడి కారుకు రెడ్-బ్లూ బీకన్ లైట్లు, వీఐపీ నంబర్ప్లేటు పెట్టుకున్నారు. ‘మహారాష్ట్ర ప్రభుత్వం’ అనే స్టిక్కర్ అమర్చారు. తనకు ప్రత్యేక వసతి సౌకర్యాలు కల్పించాలని, తగినంత సిబ్బందితోపాటు ఓ కానిస్టేబుల్తో అధికారిక ఛాంబర్ను కేటాయించాలని పట్టుబట్టారు.
పూజా ఖేద్కర్ తీరుపై పూణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయడంతో ఆమెను పుణె నుంచి వాశిమ్ జిల్లాకు బదిలీ చేశారు. ప్రొబేషన్ కాలం పూర్తయ్యేవరకు అక్కడే సూపర్ న్యూమరరీ అసిస్టెంట్ కలెక్టర్గా పూజ వ్యవహరిస్తారని ఉన్నతాధికారులు వెల్లడించారు. తాజాగా అక్కడ ఆమె ఛార్జ్ తీసుకున్నారు. అయితే వివాదంపై మాట్లాడేందుకు తనకు ప్రభుత్వ అనుమతి లేదన్నారు పూజా ఖేద్కర్. మహారాష్ట్రలోని వాసిమ్లో కొత్త పాత్ర పోషించడం హ్యాపీగా ఉందన్నారు.