
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో తుపాన్లు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు. చాలా కాలం పాటు అవి కొనసాగుతున్నాయని వివరించారు. ఇలా జరగడానికి వాతావరణ మార్పులే కారణమని చెబుతున్నారు. ప్రపంచ సరాసరి ఉష్ణోగ్రతల పెరుగుదల ఎక్కువగా దోహదపడుతున్నట్లు వివరించారు. అరేబియా సముద్రంలోని 1982 నుంచి 2019 మధ్య తుపాన్లు, పెను తుపాన్ల నిడివి, తీవ్రత, సంఖ్య ఎక్కవగా పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. అలాగే 2001-2019 మధ్య తుపాన్ల సంఖ్య 52 శాతం పెరిగినట్లు పేర్కొన్నారు. బంగాళాఖాతంలోని వాటి సంఖ్య 8 శాతం వరకు తగ్గిందన్నారు. నేడు తుపాన్లు చాలా ఎక్కువకాలం పాటు బలంగా ఉంటున్నాయని తెలిపారు. ఇందుకోసం అంఫన్ తుపానును ఉదాహరణ పేర్కొన్నారు. ఈ తుపాను తీరందాటాక కూడా బలంగానే కొనసాగి.. పెను విధ్వంసం చోటుచేసుకుంది.
సముద్రాలు వేడిగా ఉండి, గాలుల్లో అనుకూలత కొనసాగినంతకాలం తుపాన్లు శక్తిమంతంగానే ఉంటాయని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ కోల్ పేర్కొన్నారు. ప్రస్తుతం మోచా తుపాను.. చాలా వేగంగా తీవ్ర రూపం దాల్చడంపై కూడా నిపుణులు ప్రస్తావిస్తున్నారు. అది బంగ్లాదేశ్, పశ్చిమ మయన్మార్లో తీరం దాటొచ్చని.. దీనివల్ల ఆ రెండు దేశాల్లో పెను నష్టం తప్పదని ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిస్తోంది. బంగ్లాదేశ్లో గాలి దుమారాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం.. మయన్మార్లో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం జరుగుతుందని పేర్కొంది. తుపాన్లకు దారితీసే పరిస్థితుల్లో మార్పు జరగడం లేదని, వాతావరణ స్థితిగతులే మారుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే ఇందుకు కారణం సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలకు తోడు మహాసముద్రంలో వేడి జలాల వాటా కూడా పెరుగుతోందని వెల్లడించారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.