Tamilnadu Rains: తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు.. మరో రెండు రోజులు కురిసే అవకాశం

ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నాగపట్నం, తిరువారూర్, మైలదుతురై, తంజావూరు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి

Tamilnadu Rains: తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు.. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు.. మరో రెండు రోజులు కురిసే అవకాశం
Tamil Nadu Rains

Updated on: Oct 18, 2022 | 7:08 AM

తమిళనాడుపై వరుణుడు పగబట్టాడా?. కావేరీ నది పరిసరాల్లో నాన్‌స్టాప్‌గా కురుస్తోన్న వర్షాలను చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న కుండపోత వర్షాలతో రాష్ట్రం విలవిల్లాడిపోతోంది. మరోవైపు మెట్టూరు డ్యాం‌మ్‌కి డేంజర్ లెవల్‌ ఫ్లడ్ వస్తోంది. ఈశాన్య రుతుపవనాలు, బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం తమిళనాడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు కురుస్తున్నాయి. నాగపట్నం, తిరువారూర్, మైలదుతురై, తంజావూరు జిల్లాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి

కావేరీ నది వరద ఉధృతికి పరీవాహక ప్రాంతాలు నీటమునిగాయి. ఈరోడ్ నుంచి కర్ణాటకకి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. ఈరోడ్, ధర్మపురి, సేలం జిల్లాలో ఎక్కడిక్కడ రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

మెట్టూరు డ్యామ్‌కి రెండు లక్షల క్యూసెక్కుల వరద నీరు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డ్యామ్ పూర్తి స్థాయి అవుట్ ఫ్లో కెపాసిటీ 2 లక్షల క్యూసెక్కులు. కానీ కెపాసిటీకి మించి వరద వచ్చే అవకాశం ఉండటంతో.. టెన్షన్ మొదలైంది. ప్రస్తుతానికైతే వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదులుతున్నారు. కందన్‌నగర్‌, కావేరినగర్‌, అందియూర్‌ ప్రాంతాల్లో అధికారులు అలెర్టయ్యారు.

ఇవి కూడా చదవండి

మెట్టూరు డ్యామ్‌ పరివాహక ప్రాంతాల్లో NDRF బృందాలు సహాయక చర్యలు అందిస్తున్నాయి. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన వరద సహాయక చర్యల్ని తీసుకోవాలని తమిళనాడు సీఎం స్టాలిన్ అధికారులను ఆదేశించారు. నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. పలు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అటవీ ప్రాంతాల్లో భారీ వృక్షాలు విరిగి పడ్డాయి. సత్యమంగళం అటవీప్రాంతాల్లో గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

ఆందియూర్‌ నుంచి బర్గూరుకు వెళ్ళే రహదారిలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో చెన్నై – బెంగుళూరు ప్రాంతాల మధ్య వాహనాల రాకపోకలు స్తంభించాయి. అలాగే, కొండ దిగువ ప్రాంతంలోని దాదాపు 30కి పైగా కొండ గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. మరో రెండు రోజులపాటు తమిళనాడులోని ఆరు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ హెచ్చరిక.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us