
ఎన్నికల వేళ ఓటర్లను ప్రసంగం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక తాయిలాలు ప్రకటిస్తూ ఉంటాయి.. అందులోనూ ఉచిత పథకాలకు పుట్టినిల్లు లాంటి తమిళనాడు ఎన్నికలంటే ఉచితాల జోరు మామూలుగా ఉండదు. ఇప్పటికే పదుల సంఖ్యలో ఉచిత పథకాలను అక్కడి ప్రభుత్వాలు గతంలో అమలు చేసే ప్రస్తుత ప్రభుత్వం కూడా అమలు చేస్తూ ఉంది. 2026 అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో రాజకీయ పార్టీలు పొత్తుల ఏర్పాటు అంశం పూర్తి కాగానే ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత వరాల జల్లులు కురిపిస్తున్నాయి.. అందులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడిఎంకె బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పాటై ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. దీంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఉచిత పథకాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే అన్నాడీఎంకే చీఫ్ ఎడపాడి పళని స్వామి డీఎంకే అమలు చేస్తున్న పలు పథకాలకు కొనసాగింపుగా హామీలను ప్రకటించారు. డిఎంకె ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తుండగా.. అన్నా డీఎంకే అధికారంలోకి వస్తే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డీఎంకె ప్రభుత్వం 1200 వృద్ధులకు ఇస్తున్న పెన్షన్ రెండు వేలకు పెంచుతామని అన్నా డిఎంకె హామీ ఇచ్చింది. వేయి రూపాయలుగా ఉన్న మహిళలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 2000 చేస్తామని మేనిఫెస్టోలో చేర్చింది. అలాగే.. ఇంటింటికి రూ.10వేలు ఇస్తామని పేర్కొంది.
తాజాగా అన్నాడీఎంకే మ్యానిఫెస్టోలో మరికొన్ని ఉచితాలను ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ రిఫ్రిజిరేటర్ ఉచితంగా అందిస్తామని అన్నా డీఎంకే చీఫ్ పళనిస్వామి చెప్పారు. మహిళలు స్కూటీ కొనుగోలు కోసం 25 వేలు సాయం అందిస్తామని చెప్పారు. సొంతిల్లు లేని పేదలకు అమ్మ ఇంటి నిర్మించి ఇవ్వడం కూడా అన్నా డీఎంకే మ్యానిఫెస్టోలో ఉంది.
ఉచిత రేషన్ బియ్యంతో పాటు, కిలో నూనె, కిలో కందిపప్పు ఉచితంగా ఇవ్వనున్నట్లు చెప్పారు. అయితే అన్నా డీఎంకే మానిఫెస్టో ఇంతటితో పూర్తి కాలేదట.. మరిన్ని ఉచితాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అన్నా డీఎంకే ముఖ్యనేతలు చెబుతున్నారు. ఇంకా డీఎంకే పూర్తి స్థాయి మానిఫెస్టో ప్రకటించలేదు.. విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ మేనిఫెస్టో కూడా రావాల్సి ఉంది. ఇవన్నీ వచ్చాక అందులో ఎలాంటి ఉచితాలు ఉంటాయి.. ఆ ఉచితలను చూసి అన్నాడీఎంకే ఇంకా ఎలాంటి యాడ్ ఆన్ పథకాలను ప్రకటిస్తుందో చూడాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..