
వారణాసి, మార్చి 21: కాలేజీ క్యాంపస్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వ్యక్తి గత వివాదం కారణంగా ఓ విద్యార్ధి తుపాకీతో మరో విద్యార్ధిని కాల్చి చంపాడు. ఈ షాకింగ్ ఘటన శుక్రవారం (మార్చి 20) రాత్రి ఉత్తరప్రదేశ్లోని వారణాసి కాలేజీ క్యాంపస్లో చోటు చేసుకుంది. మృతుడిని ఉదయ్ ప్రతాప్ కాలేజీలో బీఏ నాలుగో సెమిస్టర్ విద్యార్థి అయిన సూర్య ప్రతాప్ సింగ్ (23)గా గుర్తించారు. మృతుడు సోషల్ సైన్సెస్ ఫ్యాకల్టీ భవనంలోని ఒక కారిడార్లో శుక్రవారం ఉదయం 11 గంటలకు తోటి విద్యార్ధి అయిన మంజీత్ చౌహాన్ కాల్చి చంపాడు. దాడి సమయంలో మంజీత్.. బాధితుడి తల, ఛాతీని లక్ష్యంగా చేసుకుని నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాడు. అనంతరం ప్రహరీ గోడ దూకి, సమీపంలోని చెత్తకుండీలో పిస్టల్ను పారవేసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తుపాకిని స్వాధీనం చేసుకున్నారు.
తీవ్ర గాయాలతో కుప్పకూలిన సూర్య ప్రతాప్ను మొదట మల్దహియాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత బీహెచ్యూ ట్రామా సెంటర్కు రిఫర్ చేశారు. దీంతో అక్కడికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోస్ట్మార్టం కేంద్రం వద్ద బాధితురాలి తండ్రి నిందితుడిని ఎన్కౌంటర్ చేసేంత వరకు అంత్యక్రియలు జరిపేందుకు వీలులేదని డిమాండ్ చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు సర్ధిచెప్పారు. అనంతరం మృతదేహాన్ని శివపూర్లోని మృతుడి ఇంటికి తరలించారు.
ఘాజీపూర్ జిల్లాకు చెందిన సూర్య ప్రతాప్ సింగ్ చదువుల కోసం వారణాసిలో నివసిస్తున్నాడు. అతడు చదువులో చరుకుగా ఉండే విద్యార్థి. అతడి తల్లిదండ్రులు రిషిదేవ్ సింగ్, కిరణ్ సింగ్లకు సూర్య ఏకైక కుమారుడు. సూర్యతోపాటు మరో ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. తోటి విద్యార్థి అయిన మంజీత్ చౌహాన్తో సూర్యకు వ్యక్తిగత వివాదం ఉంది. దీంతో పగ పెంచుకున్న మంజీత్.. కాలేజీ క్యాంపస్లోనే సూర్యను గన్తో కాల్పులు జరిపాడు. ఈ ఘటన కాలేజీలో ఘర్షణలకు దారితీసింది. ఆగ్రహించిన విద్యార్థులు కాలేజీ మెయిన్ గేట్కు తాళం వేసి, ఆస్తులను ధ్వంసం చేశారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. ముగ్గురు ఉపాధ్యాయులపై దాడి జరగగా.. ఓ ఉపాధ్యాయుడికి తలకు గాయం కావడంతో అతడిని పోలీసుల రక్షణలో ఆసుపత్రికి తరలించారు. ఉద్రిక్తతలు పెరగడంతో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు లోపల చిక్కుకున్న ఉపాధ్యాయులను, బోధనేతర సిబ్బందిని క్యాంపస్ నుంచి బయటకు తరలించారు. ఇద్దరు విద్యార్థుల మధ్య వ్యక్తిగత వివాదం కారణంగానే ఈ కాల్పులు జరిగాయని వారణాసి పోలీస్ కమిషనర్ మోహిత్ అగర్వాల్ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఈ సంఘటన క్యాంపస్ భద్రతపై, ముఖ్యంగా కాలేజీలోకి తుపాకీని ఎలా తీసుకువచ్చారనే దానిపై తీవ్ర స్థాయిలో చర్చలు సాగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.