
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థతకు గురైనట్టుగా తెలిసింది. ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి బాగానే ఉందని, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్న కారణంగా ఆమెను ఆస్పత్రిలో చేర్పించాల్సి వచ్చిందని సమాచారం. ప్రస్తుతం సోనియా పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పారు. సీనియర్ పల్మనాలజిస్ట్ పర్యవేక్షణలో సోనియాగాంధీకి వైద్యం అందిస్తున్నారు.
నివేదికల ప్రకారం, సోనియా గాంధీ గత కొద్ది రోజులుగా తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్యం కారణంగా అప్పుడప్పుడు చెకప్ల కోసం ఆస్పత్రికి వెళ్తుంటారని తెలిసింది. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం సోనియా గాంధీ ఆసుపత్రిలో చేరినట్లు వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం దేశరాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగింది. ప్రజల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారింది. దీనికి ఓ ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా వచ్చి చేరిందని జేఎన్యూ అధ్యయనం వెల్లడించింది. మందులకు లొంగని బ్యాక్టీరియా ఒకటి గాలిలో ప్రమాదకర స్థాయిలో పెరిగిందని అధ్యయనం తేల్చింది. దీంతో ప్రజలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక మంది ఢిల్లీని వదిలి వెళ్లిపోవాలంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..