‘చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి’ సుప్రీంకోర్టు హెచ్చరిక

ఘన వ్యర్థాల నిర్వహణ (Solid Waste Management) కేవలం పారిశుద్ధ్య కార్మికుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి బాధ్యత అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పెద్ద మాల్స్, హోటళ్లు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాలు, భారీ నివాస సముదాయాలు వంటి బల్క్ వేస్ట్ జనరేటర్లపై (Bulk Waste Generators) నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టి, జస్టిస్ ఎన్‌వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి వ్యర్థాల ఉత్పత్తిదారుడు చెత్తను మూలస్థాయిలోనే వేరు చేయడం, సురక్షితంగా నిల్వ చేయడం, నిర్దేశిత విధానంలో అధికారులకు అప్పగించడం తప్పనిసరి అని పేర్కొంది..

చెత్త నిర్వహణ బాధ్యత ప్రతి ఒక్కరిది.. కఠిన చర్యలు తీసుకోండి సుప్రీంకోర్టు హెచ్చరిక
Supreme Court On Solid Waste Management

Updated on: Aug 20, 2026 | 9:57 AM

న్యూఢిల్లీ, ఆగస్ట్ 20: దేశవ్యాప్తంగా బల్క్ వేస్ట్ జనరేటర్లను ఆరు వారాల్లో గుర్తించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిబంధనలను పాటించని సంస్థలు, సముదాయాలపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించడంలో విఫలమైతే అవసరాన్ని బట్టి నీరు లేదా విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయవచ్చని ధర్మాసనం పేర్కొంది. నిబంధనలు పాటించినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే ఆయా సదుపాయాలను పునరుద్ధరించాలని సూచించింది. మున్సిపల్ సంస్థలు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను సక్రమంగా అమలు చేయాలన్న అంశంపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (NGT) ఇచ్చిన ఉత్తర్వులకు సంబంధించిన అప్పీళ్లను సుప్రీంకోర్టు విచారించింది. మొదట భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సంబంధించిన వ్యవహారంగా ప్రారంభమైన ఈ కేసు.. సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణపై దృష్టి సారించేలా విస్తరించింది. సమాజంలో ‘చెత్తను ఉత్పత్తి చేసే హక్కు ఉంది కానీ దాని ప్రభావాన్ని నియంత్రించేందుకు సహకరించాల్సిన అవసరం లేదు’ అనే ధోరణి ఉండటం విచారకరమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఘన వ్యర్థాల నిర్వహణను పర్యవేక్షించేందుకు డిజిటల్ విధానాలను విస్తృతంగా ఉపయోగించాలని సుప్రీంకోర్టు సూచించింది. చెత్త పేరుకుపోయిన ప్రాంతాల జియో-ట్యాగ్‌డ్ ఫొటోలు, ప్రతి నెలా అమలు నివేదికలను ప్రత్యేక పోర్టల్ ద్వారా సమర్పించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు మానిటరింగ్ కమిటీ.. రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల ద్వారా జిల్లా కలెక్టర్లు తమ పరిధిలోని బల్క్ వేస్ట్ జనరేటర్లను గుర్తించేలా చర్యలు తీసుకోవాలి. గుర్తించిన సంస్థలకు ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించాల్సిన నిబంధనలను తెలియజేయాలని పేర్కొంది. రైల్వేలు, రక్షణ శాఖ, ప్రభుత్వ రంగ సంస్థలు (PSUs), ఇతర కేంద్ర మంత్రిత్వ శాఖలు కూడా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటిస్తున్నాయా లేదా అన్నది మానిటరింగ్ కమిటీ పరిశీలించనుంది. మున్సిపల్ వ్యర్థాల కారణంగా నదుల్లో జరుగుతున్న నీటి కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సంబంధిత సమాచారాన్ని కోర్టు ముందు ఉంచాలని కమిటీని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

పాఠశాలలు, కాలేజీల్లో వ్యర్థాల నిర్వహణపై అవగాహన

ఘన వ్యర్థాల నిర్వహణపై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు పాఠశాలలు, ఉన్నత విద్యా సంస్థల పాఠ్యాంశాలు, శిక్షణ కార్యక్రమాల్లో సైద్ధాంతిక, ప్రాక్టికల్ విద్యను వెంటనే చేర్చాలని సుప్రీంకోర్టు సూచించింది. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు, శిక్షణ పొందిన విద్యార్థులు తమ ఇళ్లలోనే వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది. చెత్త నిర్వహణ అనేది పారిశుద్ధ్య సిబ్బంది పని మాత్రమే కాదు.. చెత్తను ఉత్పత్తి చేసే ప్రతి వ్యక్తి, సంస్థ బాధ్యత అని ధర్మాసనం స్పష్టం చేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us