బెంగళూరు బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావు సంచలన ఆరోపణలు చేశారు. కస్టడీలో తనను టార్చర్ చేశారని, ఆహారం కూడా ఇవ్వకుండా వేధించారని ఆరోపించారు. తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని, ఈ కేసుతో తనకు సంబంధం లేదన్నారు రన్యా రావు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బెంగళూర్ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక మలుపు తిరిగింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన నటి రన్యా రావు జైలు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. జైల్లో తనను టార్చర్ చేస్తున్నారని ఆరోపించారు. తెల్ల కాగితాలపై బలవంతంగా సంతకాలు తీసుకున్నారని అన్నారు.
బంగారం స్మగ్లింగ్తో తనకు సంబంధం లేదన్నారు రన్యా రావు. తనను డీఆర్ఐ అధికారులు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయలేదని , విమానంలోనే అరెస్ట్ చేశారని ఆరోపించారు. జైల్లో ఆహారం ఇవ్వకుండా వేధించారని, నిద్ర లేకుండా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. చాలా సార్లు కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై శారీరకంగా దాడి చేశారని, 10 నుంచి 15 సార్లు చెంపదెబ్బలు కొట్టారని లేఖలో పేర్కొన్నారు. డీఆర్ఐ అధికారులు తయారు చేసిన స్టేట్మెంట్లపై సంతకాలు చేయాలని ఒత్తిడి తెచ్చారని, 40 ఖాళీ పేపర్లపై, 50-60 తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కనీసం నిద్రపోడానికి కూడా అనుమతించలేదని, ఆహారం కూడా ఇవ్వలేదని తెలిపారు.
బెంగళూరు ఎయిర్పోర్ట్లో తన నుంచి బంగారం స్వాధీనం చేసుకోలేదని లేఖలో తెలిపారు రన్యా రావు. ఢిల్లీకి చెందిన కొందరు వ్యక్తులు ఈ కేసులోని ఇతర అనుమానితులను రక్షించేందుకు తనను తప్పుడు కేసులో ఇరికించారని ఆరోపించారు. ఇక ఈ కేసులో తన సవతి తండ్రి ప్రమేయం లేదని రన్యారావు లేఖలో స్పష్టం చేశారు. అయితే, మార్చి 7వ తేదీన డీఆర్ఐకి ఇచ్చిన వాంగ్మూలంలో రన్యారావు వాదన మరోలా ఉంది. అప్పుడు తాను బంగారం స్మగ్లింగ్కు పాల్పడినట్లు నటి ఒప్పుకుంది. ఆమె నుంచి 17 గోల్డ్ బిస్కట్స్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది.
మార్చి 10న కోర్టు ఎదుట హాజరు పరచగా.. తనపై దాడి జరగలేదని.. కానీ మానసికంగా హింసించారని ఆరోపించింది. డీఆర్ఐ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ఆపేసినప్పుడు తనను మాటలతో వేధించారని ఆమె పేర్కొన్నారు. తన దగ్గరి నుంచి 17 బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపింది. ఆ తర్వాత మార్చి 10న రన్యా రావు కోర్టులో హాజరుపరచగా.. తనపై ఎలాంటి దాడి జరగలేదని పేర్కొంది. ‘వారు నన్ను కొట్టలేదు, కానీ మాటలతో తీవ్రంగా దుర్భాషలాడారు. అది నాకు తీవ్ర మానసిక క్షోభ కలిగించింది’ అని రన్యారావు న్యాయమూర్తి ముందు తెలిపారు. మరోవైపు, రన్యా రావు స్నేహితుడు తరుణ్ రాజ్ కోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. తరుణ్ రాజ్ బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది.
ఇదిలావుంటే, ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె సవతి తండ్రి, డీజీపీ ర్యాంకు అధికారి కె.రామచంద్రరావును సెలవుపై వెళ్లాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఎలాంటి కారణాలు ప్రస్తావించలేదు. ప్రస్తుతం ఆయన ‘కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్’ ఛైర్మన్, ఎండీగా కొనసాగుతున్నారు. కాగా, తాజాగా ఆయన స్థానంలో ఏడీజీపీ (రిక్రూట్మెంట్) కేవీ శరత్ చంద్రకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రామచంద్రరావు పాత్ర ఏమైనా ఉందా అనే దానిపైనా దృష్టిసారించాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా రామచంద్రరావును కంపల్సరీ లీవ్పై పంపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..