
తిరువనంతపురం, డిసెంబర్ 18: గత కొంతకాలంలోని కేరళలోని శబరిమల ఆలయం వివాదాలకు నెలవుగా మారింది. ఇప్పటికే శబరిమలలో బంగారం దొంగతనం వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓ అయ్యప్ప భక్తి గీతం వైరల్గా మారింది. అయితే ఈ భక్తి గీతాన్ని పేరడీగా మార్చి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యంగ్యంగా రూపొందించారు. నిత్యం దేవాలయాల్లో మారుమ్రోగే ప్రసిద్ధ అయ్యప్ప భక్తి గీతం ‘పొట్టియే కెట్టియే’ పాట ఆధారంగా పేరడీ పాట రూపొందించడంతో మరో వివాదం రాజుకుంది. అసలు పాట అయ్యప్పను స్తుతిస్తుంది. అయితే పేరడీ వెర్షన్ వచ్చిన పాట శబరిమల ఆలయంలో జరిగిన బంగారు దోపిడీ గురించి వ్యగ్యంగా రూపొందించారు. దీంతో మత విశ్వాసాలను అవమానించడం, జనాలను ఘర్షణకు ప్రేరేపించడం వంటి ఆరోపణలపై కేరళ పోలీసులు బుధవారం (డిసెంబర్ 17) ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. ఈ పాట వీడియోను చిత్రీకరించిన కంపెనీపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.
తిరువాభరణపథ సంరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి ప్రసాద్ కుళికల ఫిర్యాదు మేరకు తిరువనంతపురంలోని సైబర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ సంస్థ.. పండలం నుంచి శబరిమల వరకు ఆభరణాలను ఊరేగింపుగా తీసుకెళ్లే సాంప్రదాయ మార్గాన్ని సంరక్షిస్తుంది. ఇక పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదైన చేసిన నిందితుల లిస్టులో ఖతార్కు చెందిన రచయిత జిపి కున్హబ్దుల్లా చలప్పురం, సింగర్ డానిష్ ముహమ్మద్, వీడియోను చిత్రీకరించిన సీఎంసీ మీడియా, నిర్మత సుబైర్ పంతులూర్లను నిందితులుగా పేర్లు చేర్చారు. వీరిపై BNS సెక్షన్లు 299 (మతపరమైన భావాలను రెచ్చగొట్టడం), 353 (1) సి (సమూహాలను ఘర్షణకు ప్రేరేపించడం) కింద కేసు నమోదు చేశారు. నిందితులు అయ్యప్ప భక్తి గీతం శరణ మంత్రాన్ని అవమానించారని, పైగా ఈ వ్యంగ్య గీతాన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రసారం చేయడాన్ని నేరంగా ఎత్తి చూపుతూ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కాగా కేరళ చలనచిత్రోత్సవ వివాదం నేపథ్యంలో ఈ ఎఫ్ఐఆర్ వెలుగులోకి వచ్చింది. కొన్ని చిత్రాల ప్రదర్శనకు సెన్సార్ మినహాయింపు నిరాకరించడాన్ని సీఎం పినరయి విజయన్ కేంద్రపై విమర్శలు గుప్పించారు. సంఘ్ పరివార్ పాలన.. నిరంకుశ పాలనను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఇక వివాదం చెలరేగిన అయ్యప్ప పేరడీ సాంగ్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ప్రతిపక్ష పార్టీలు దుయ్యబట్టాయి. సీపీఐ(ఎం) పేరడీకి భయపడుతుందని వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. గతంలో కూడా అయ్యప్ప భక్తి పాటలను పేరడీ పాటలుగా ట్యూన్ చేశారని, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.