
సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. ఈ పర్యటనలో ఆయన తనదైన శైలిలో యువతను ఉత్సాహపరుస్తూ ఫుట్బాల్ ఆడుతున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా కుర్తా-పైజామాలో కనిపించే ప్రధాని, ఈసారి ట్రాక్ ప్యాంట్లు, స్పోర్ట్స్ టీ-షర్ట్, ఫుట్బాల్ స్పైక్లు ధరించి విభిన్నమైన అవతారంలో కనిపించారు. గాంగ్టక్లోని యువకులతో కలిసి ఆయన మైదానంలో ఫుట్బాల్ ఆడారు. ఈ అనుభవాన్ని ప్రధాని సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పంచుకుంటూ, “గాంగ్టక్లోని ఈ అందమైన ఉదయం వేళ యువ మిత్రులతో ఫుట్బాల్ ఆడటం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది” అని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిక్కిం పర్యటన కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, ఆ రాష్ట్ర అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలిచింది. రూ. 4,000 కోట్లతో చేపట్టబోయే అభివృద్ది ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, వ్యవసాయ రంగాల్లో పలు అభివృద్ధి పనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. హిమాలయలతో సిక్కిం రాష్ట్రం కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడం ఈ ప్రాజెక్టుల ప్రధాన లక్ష్యం.
గత ఏడాది ప్రతికూల వాతావరణం కారణంగా పర్యటన వాయిదా పడగా, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మోదీ ఇప్పుడు సిక్కిం చేరుకున్నారు. సోమవారం సాయంత్రం గాంగ్టక్లో జరిగిన భారీ రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సిక్కిం రాష్ట్రం ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతున్న ఈ స్వర్ణోత్సవ వేళ ప్రధాని పర్యటన, రాష్ట్ర సుస్థిర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా నిలిచింది.
Nothing like playing some football with my young friends in Sikkim on a lovely Gangtok morning! ⚽️ pic.twitter.com/5xEceWBH1f
— Narendra Modi (@narendramodi) April 28, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..