PM Modi launch Indian Space Association: ప్రపంచాన్ని అనుసంధానించడంలో.. భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా మార్చడంలో అంతరిక్ష రంగం కీలక పాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. సంస్కరణలతోనే భారతదేశాన్ని నూతన ఆవిష్కరణ కేంద్రంగా తీర్చిదిద్దగలమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇండియన్ స్పేస్ అసోసియేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలతో, పలు కంపెనీల ప్రతినిధులతో ప్రధాని సంభాషించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. మేము అంతరిక్ష సంస్కరణలు నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంటాయని.. అదే తమ విధానమని తెలిపారు. స్వేచ్ఛగా ప్రైవేట్ రంగాన్ని భాగస్వామ్యం చేయడం, ప్రభుత్వ సహకారం, భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయడం, అంతరిక్ష రంగాన్ని సామాన్యుడికి అందుబాటులోకి తీసుకురావడమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నిర్ణయాత్మకమైన విధానంతో ముందడుగు వేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.
అంతరిక్ష రంగం, అంతరిక్ష సాంకేతికతకు సంబంధించి నేడు దేశంలో జరుగుతున్న సంస్కరణలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ దృష్టితో.. మన దేశం సమగ్ర సంస్కరణలతో ముందుకు సాగుతుందన్నారు. ఇది కేవలం విజన్ మాత్రమే కాదని.. బాగా ఆలోచించి తీసుకుంటున్న నిర్ణయాలని తెలిపారు. దీంతోపాటు ఆర్థిక వ్యూహం కూడా అంటూ ప్రధాని తెలిపారు. సాంకేతిక రంగంతో ప్రపంచ అభివృద్ధి సులభతరమని ప్రధాని మోదీ తెలిపారు. ఎండ్ టు ఎండ్ టెక్నాలజీని కలిగి ఉన్న అతికొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి అని ప్రధాని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష పరిశోధనలు, అంతరిక్ష సాంకేతికతలను నిరంతరం అన్వేషించాలని ఆయన శాస్త్రవేత్తలను కోరారు.
130 కోట్ల మంది దేశప్రజల పురోగతికి భారత అంతరిక్ష రంగం గొప్ప మాధ్యమమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అంతరిక్ష రంగంతోనే అన్ని మూడిపడి ఉన్నాయని మోదీ తెలిపారు. మ్యాపింగ్, కనెక్టివిటీ, బిజినెస్, రవాణా పలు రంగాలన్నీ అనుసంధానమై ఉన్నాయన్నారు. అంతరిక్ష రంగంలో సంస్కరణలు, అభివృద్ధి కోసం ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు అభినందిస్తున్నానంటూ ప్రధాని మోదీ తెలిపారు. 20 వ శతాబ్దంలో విభజనతో పాలించే ధోరణిని మనమంతా చూశామని ప్రధానమంత్రి అన్నారు. ఇప్పుడు 21వ శతాబ్దంలో ప్రపంచాన్ని ఏకం చేయడంలో భారత అంతరిక్ష రంగం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ప్రధాని పేర్కొన్నారు.
ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ఐఎస్పీఏ) వ్యవస్థాపక కంపెనీల్లో లార్సెన్ అండ్ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్ మైఇండియా, వాల్చంద్నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ ఉన్నాయి. దీంతోపాటు మరికొన్ని సంస్థలు కూడా భాగస్వామ్యంగా ఉన్నాయి.
Also Read: