
బ్రిటన్ ప్రధానమంత్రి పదవిని దక్కించుకొని చరిత్ర సృష్టించిన భారత సంతతి వ్యక్తి రిషి సునాక్కు ప్రపంచవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. బ్రిటన్ నూతన ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న రిషి సునాక్కు.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. రిషి సునాక్.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయనతో కలిసి ప్రపంచ సమస్యలపై సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు, రోడ్మ్యాప్ 2030ని అమలు చేసేందుకు ఎదురుచూస్తున్నట్టు ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోడీ సోమవారం రాత్రి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా యూకే (యూనైటెడ్ కింగ్డమ్) లో ఉన్న భారతీయులకు ప్రత్యేకంగా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల చారిత్రక బంధాలను ఆధునిక భాగస్వామ్యంగా మారుస్తామంటూ ప్రధాని మోడీ ట్విట్లో వెల్లడించారు.
కేంద్ర మంత్రులు, పలు పార్టీల రాజకీయ నాయకులు సైతం రిషి సునాక్కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. దీపావళి పర్వదినాన రిషి సునాక్ ప్రధాని పదవికి ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ట్విట్లు చేస్తున్నారు.
Warmest congratulations @RishiSunak! As you become UK PM, I look forward to working closely together on global issues, and implementing Roadmap 2030. Special Diwali wishes to the ‘living bridge’ of UK Indians, as we transform our historic ties into a modern partnership.
— Narendra Modi (@narendramodi) October 24, 2022
కాగా.. బ్రిటన్ అధికార కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత ఎన్నికల్లో ప్రధాని పదవికి లిజ్ ట్రస్పై పోటీచేసి ఓటమిపాలైన కొద్ది వారాల్లోనే యూకేలో రాజకీయ సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే. అనంతరం మారిన రాజకీయ పరిస్థితులతో లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
ఆ తర్వాత జరిగిన టోరి పార్టీ ఎన్నికల్లో రిషి సునాక్ గెలుపొందారు. పోటీ నుంచి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వైదొలిగిన తర్వాత.. మిగిలిన చివరి ప్రత్యర్థి పెన్నీ మోర్డాంట్ కూడా వైదొలిగారు. దీంతో రిషి సునాక్.. కన్జర్వేటివ్ పార్టీ నేతగా, నూతన ప్రధానిగా ఏకగ్రీవంగా ఎన్నికై బ్రిటిష్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..