Watch Video: సీఎం సభకు తెచ్చిన పూల కుండీలు.. కళ్లుమూసి తెరిచేలోపు మాయం! ఏం జరిగిందో మీరే చూడండి.. వీడియో
ముఖ్యమంత్రి 'ప్రగతి యాత్ర'లో భాగంగాకు తమ బస్తీకి వస్తున్నారని అధికారులు ముచ్చటపడి రకరకాల పూలమొక్కలు తీసుకొచ్చి అందంగా అలంకరించారు. కానీ స్థానికులు చేసిన పనికి అధికారులంతా అవాక్కయ్యారు. స్థానికులు తలోదిక్కు నుంచి వచ్చి దొరికిన కాడికి పూలమొక్కలు చేతబట్టి ఉడాయిస్తుంటే చోద్యం చూస్తూ ఉండిపోయారు అధికారులు..

బక్సర్, ఫిబ్రవరి 16: తమ బస్తీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారని అధికారులు ముచ్చటపడి రకరకాల పూలమొక్కలు తీసుకొచ్చి అందంగా అలంకరిస్తే.. స్థానికులు చేసిన పనికి అంతా అవాక్కయ్యారు. తలోదిక్కు నుంచి వచ్చి దొరికిన కాడికి పూలమొక్కలు చేతబట్టి ఉడాయించారు. ఈ విచిత్ర ఘటన బీహార్లోని బక్సర్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలేం జరిగిందంటే..
బీహార్లోని బక్సర్ జిల్లాలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ‘ప్రగతి యాత్ర’లో భాగంగాకు శనివారం బక్సర్లో అనేక ప్రాంతాలను సందర్శించారు. ఇందుకోసం ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు సర్క్యూట్ హౌస్ వెలుపల అధికారులు రకరకాల పూల కుండీలను ఉంచారు. జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన ఈ కుండలను ముఖ్యమంత్రి వేదిక నుండి వెళ్లిపోయిన కొన్ని క్షణాల్లోనే స్థానిక మహిళలు, పిల్లలు పూల కుండీలు చేతబట్టి పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది స్పందించేలోపే స్థానికులు వందలాది కుండీలను మాయం చేశారు. ఈ కుండీలన్నింటనీ అధికారులు స్థానిక నర్సరీ నుంచి మున్సిపల్ కౌన్సిల్ ద్వారా అద్దెకు తీసుకు వచ్చినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
फूलों के गमलों को भी नहीं छोड़ा! नीतीश कुमार के बक्सर में प्रगति यात्रा के तुरंत बाद का दृश्य….#NitishKumar #Bihar #Biharpolitics#Buxar pic.twitter.com/X6jB9mMkTS
— Aman Mishra (@AmanM55) February 15, 2025
ముఖ్యమంత్రి పర్యటనపై మురికివాడ ప్రాంతాల మహిళలు నిరసన చేపట్టారు. అభివృద్ధి హామీలకు బదులుగా ఓట్లు డిమాండ్ చేస్తున్న నితీష్ కుమార్ పై వారు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఓటు వేయకూడదని వారు తమ ఉద్దేశ్యాన్ని ప్రకటించారు. పరిస్థితిని నియంత్రించడానికి, సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (SDM) జోక్యం చేసుకుని నిరసనకారులను దారి మళ్లించారు. కొంతమంది స్థానికులు ఈ ప్రాంతంలో అభివృద్ధి పనులు కేవలం ముఖ్యమంత్రి పర్యటన కోసమే జరిగాయని ఆరోపించారు. అయితే సీఎం నితీష్ ప్రగతి యాత్రలో భాగంగా బక్సర్ జిల్లాలో పలు కార్యక్రమాలను వరుసగా ప్రారంభించారు.
బక్సర్లోని 51 గ్రామాలు, 20 పంచాయతీలలోని 36,760 గృహాలకు స్వచ్ఛమైన గంగా జలాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న బీహార్ ప్రభుత్వం.. రూ.202 కోట్లతో నిర్మించిన బహుళ-గ్రామ నీటి సరఫరా ప్రాజెక్టును ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రారంభించారు. ఆర్సెనిక్ కాలుష్యం వల్ల తీవ్రంగా ప్రభావితమైన డయారా ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ చాలా కీలకంగా మారనుంది. దీనిని క్యాన్సర్ పీడిత జోన్గా గతంలో ప్రభుత్వం ప్రకటించింది. దీనితోపాటు సిమ్రిలో ఓ నమూనా పంచాయతీ భవనాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. బక్సర్లోని గోలంబార్ ప్రాంతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో విశ్వామిత్ర హోటల్కు శంకుస్థాపన చేశారు. రామరేఖ ఘాట్లో రూ.13 కోట్ల ప్రాజెక్టును ప్రారంభించారు. 12 గదుల అతిథి గృహాన్ని కూడా ఆయన ప్రారంభించారు. అనంతరం జిల్లా కేంద్రంలో అధికారులతో అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




