Indigo Flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. టేకాఫ్ సమయంలో చెలరేగిన మంటలు..

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఉన్నట్టుండి మంటలు, నిప్పురవ్వలు వచ్చాయి.

Indigo Flight: ఇండిగో విమానానికి తప్పిన పెను ప్రమాదం.. టేకాఫ్ సమయంలో చెలరేగిన మంటలు..
Indigo Flight Fire

Updated on: Oct 29, 2022 | 7:11 AM

ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో ఉన్నట్టుండి మంటలు, నిప్పురవ్వలు వచ్చాయి. దీంతో విమానాశ్రయంలోనే ఫ్లైట్‌ను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో జరిగింది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్ లో మంటలు చెలరేగినట్లు పైలెట్లు, సిబ్బంది గుర్తించారు. వెంటనే విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసరంగా నిలిపివేశారు. ఈ సమయంలో విమానంలో దాదాపు 184 మంది ఉన్నారు. 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానం టేకాఫ్ కోసం రన్‌వేపై అప్పుడే బయలుదేరిందని.. సమస్యను గుర్తించి దాన్ని నిలిపివేసి ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు.

డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఐజిఐ ఎయిర్‌పోర్ట్) తనూ శర్మ ఈ ఘటనపై మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి 22.08 గంటలకు ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కి, ఢిల్లీ నుంచి వెళ్తున్న ఫ్లైట్ నంబర్ 6E2131 ఇంజిన్‌లో మంటలు చెలరేగినట్లు CISF కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చినట్లు తెలిపారు. కాగా.. ఈ ఘటన అనంతరం ప్రయాణికులను మరో విమానంలో తరలించినట్లు అధికారులు తెలిపారు.

ఈ విమాన ఘటనకు సంబంధించిన వీడియోను ఓ ప్యాసింజెర్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. రన్‌వేపై నిప్పురవ్వలు ఎగసిపడుతున్న వీడియోను ట్వీట్ చేశారు. దీనిపై ఇండిగో స్పందిస్తూ.. ప్రయాణీకులకు కలిగించిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నామని తెలిపింది. టేకాఫ్ రోల్ సమయంలో సాంకేతిక లోపంతో విమానం ఇంజిన్లో మంటలు చెలరేగినట్లు తెలిపింది.

ఇవి కూడా చదవండి

దీనిపై ఎయిర్‌లైన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది.. ఢిల్లీ నుంచి బెంగుళూరుకు బయలుదేరిన విమానం 6E2131 టేకాఫ్ రోల్‌లో ఉన్నప్పుడు సాంకేతిక సమస్యను ఎదుర్కొందని.. వెంటనే పైలట్ టేకాఫ్‌ను నిలిపివేశారని పేర్కొంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ క్షేమమని తెలిపింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..