నిర్భయ దోషుల పిటిషన్లు..ఉరిపై సందేహాలు

|

Jan 30, 2020 | 12:45 PM

నిర్భయ దోషులకు ఉరి అమలయ్యేనా..? కోర్టు డెత్‌ వారెంట్‌ ప్రకారం ఫిబ్రవరి 1న మరణశిక్ష విధించేనా..? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. దోషులు ఒక్కొక్కరుగా కోర్టుల్లో పిటిషన్లు వేస్తుండటంతో మరణశిక్ష అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉరి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు నిర్భయ దోషులు. శిక్షను ఆలస్యం చేసేందుకు దారులు వెతుక్కుంటున్నారు. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని తప్పించుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. క్యూరేటివ్‌, మెర్సీ, రివ్యూ పిటిషన్లతో కాలయాపన చేస్తున్నారు. తాజాగా అక్షయ్‌ ఠాకూర్‌ క్యూరేటివ్‌ […]

నిర్భయ దోషుల పిటిషన్లు..ఉరిపై సందేహాలు
Follow us on

నిర్భయ దోషులకు ఉరి అమలయ్యేనా..? కోర్టు డెత్‌ వారెంట్‌ ప్రకారం ఫిబ్రవరి 1న మరణశిక్ష విధించేనా..? ఇప్పుడిదే దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. దోషులు ఒక్కొక్కరుగా కోర్టుల్లో పిటిషన్లు వేస్తుండటంతో మరణశిక్ష అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఉరి నుంచి తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు నిర్భయ దోషులు. శిక్షను ఆలస్యం చేసేందుకు దారులు వెతుక్కుంటున్నారు. చట్టాల్లోని లొసుగులను ఉపయోగించుకొని తప్పించుకునేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. క్యూరేటివ్‌, మెర్సీ, రివ్యూ పిటిషన్లతో కాలయాపన చేస్తున్నారు.

తాజాగా అక్షయ్‌ ఠాకూర్‌ క్యూరేటివ్‌ పిటిషన్‌, వినయ్‌ శర్మ క్షమాభిక్ష అర్జీ పెట్టుకున్నారు. అక్షయ్‌ పిటిషన్‌పై సుప్రీంలో మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరగనుంది. జస్టిస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం..వాదనలు విననుంది. ఇక వినయ్‌ శర్మ మెర్సీ పిటిషన్‌పై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్రపతి క్షమాభిక్ష అర్జీని తిరస్కరించినా..నిబంధనల ప్రకారం 14 రోజుల తర్వాతే ఉరిశిక్ష అమలుచేయాల్సి ఉంటుంది. అలాగే ఒకే నేరంలో దోషులందరినీ ఒకేసారి ఉరి తీయాల్సి ఉంటుంది. ఏ ఒక్కరి కేసు కోర్టులో పెండింగ్‌లో ఉన్నా శిక్ష అమలుచేయడానికి వీల్లేదు. దీంతో దోషులకు ఫిబ్రవరి 1న మరణశిక్షపై సందిగ్ధత నెలకొంది. మరోసారి మరణశిక్ష వాయిదా పడే అవకాశముందంటున్నారు న్యాయ నిపుణులు.

ఇప్పటికే అక్షయ్‌, ముకేష్‌ రివ్యూ పిటిషన్లను కూడా సుప్రీం తిరస్కరించింది. కొద్ది రోజులముందే వినయ్‌, ముకేష్‌ క్యూరేటివ్‌ పిటిషన్లు, పవన్‌ గుప్తా తాను మైనర్‌నంటూ వేసిన పిటిషన్ కూడా కొట్టివేసింది కోర్టు. తాజాగా అక్షయ్‌ క్యూరేటివ్‌, వినయ్‌ మెర్సీ పిటిషన్లు ఉన్నాయి. మరోవైపు శిక్ష అమలు వాయిదాల మీద వాయిదాలు పడుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడేళ్లుగా తమకు న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్భయ తల్లిదండ్రులు. తప్పుడు పత్రాలతో శిక్ష నుంచి తప్పించుకునేందుకే పిటిషన్ల పేరుతో జాప్యం చేస్తున్నారని మండిపడుతున్నారు.