న్యూఢిల్లీ, జులై 11: నీట్ యూజీ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్ పరీక్ష అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2020 నుంచి 2024 వరకు జరిగిన నీట్ పరీక్ష మార్కులను విశ్లేషించారు. వీటిల్లో సగటు స్కోర్కు అనుగుణంగానే కటాఫ్ మార్కులు ఉన్నాయని, వాటితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాల్లో పెద్దగా తేడీ ఏమీ లేదని ఎన్టీఏ కోర్టుకు వెల్లడించింది. 2020లో కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో దేశ వ్యాప్తంగా 13.6 లక్షల మంది పరీక్షకు హాజరవగా.. 720 మార్కులకు గానూ సగటు స్కోర్ 297.18గా నమోదైనట్లు తెలిపింది. ఈ పరీక్షలో జనరల్ కేటగిరీ కటాఫ్ 147గా ఉన్నట్లు పేర్కొంది. ఇక నీట్ యూజీ 2024 సగటు స్కోర్ 323.55గా ఉందని, క్వాలిఫైయింగ్ మార్కులు 164గా నిర్ధారించినట్లు కోర్టుకు ఇచ్చిన సమాధానంలో ఎన్టీయే పేర్కొంది.
ఇక ఈ ఏడాది నీట్ పరీక్షకు 23.33 లక్షల మంది పరీక్షకు హాజరైనట్లు, ఇంత ఎక్కువ స్థాయిలో పరీక్షకు హాజరు కావడం ఇదే తొలిసారి అని చెప్పింది. పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన కేంద్రాల్లోని విద్యార్థుల మార్కుల్లో కూడా పెద్ద వ్యత్యాసం ఏమీ లేదని వెల్లడించింది. ఇదిలాఉంటే నీట్-యూజీ పరీక్షలో ఎలాంటి సామూహిక అవకతవకలు జరగలేదని కేంద్రం బుధవారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ చేసిన డేటా అనలిటిక్స్ను ఉటంకిస్తూ.. ఒకవేళ అభ్యర్ధులు మాల్ప్రాక్టీస్కు పాల్పడి ఉంటే అభ్యర్థులు అసాధారణ స్కోర్ సాధించి ఉండేవారని, కానీ విద్యార్ధుల మార్కుల్లో అలాంటి మార్పులేమీ లేవని కేంద్రం పేర్కొంది.
కాగా నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని కోరుతూ నీట్ అభ్యర్ధులు సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. విచారణలో భాగంగా నీట్ పేపర్ లీకైనమాట వాస్తమేనని కోర్టు స్పష్టం చేసింది. అయితే పరీక్షను మాత్రం రద్దు చేయడం సమంజసం కాదని, అది చివరి ఆప్షన్గా మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. మరో వైపు నీట్ ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయస్థాయిలో ఫస్ట్ ర్యాంకు రావడం ఇప్పటికీ మింగుడు పడని విషయంగా మిగిలిపోయింది. దీనిపై ఎన్టీయే ఇప్పటి వరకూ ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. ఇక ఇప్పటికే గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి.. ఆ మార్కులు తొలగించి, మళ్లీ పరీక్ష నిర్వహించగా.. సవరించిన నీట్ ర్యాంకులను ఎన్టీఏ విడుదల చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో విచారణ నేపథ్యంలో నీట్ కౌన్సిలింగ్ కూడా వాయిదా పడింది. పిటిషన్ల విచారణ ముగిసే వరకు కౌన్సెలింగ్ వాయిదా వేయాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించిన సంగతి తెలిసిందే.