
ఎట్టకేలకు నీట్-యూజీ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. సుప్రీంకోర్టు గురువారం ఫలితాల వెల్లడికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించిన తర్వాతి రోజే ఫైనల్ కీ, పరీక్ష ఫలితాలను విడుదల చేస్తారని విద్యార్థులు అనుకున్నారు. కానీ నాలుగు రోజులైనా ఫలితాలు రాకపోవడంపై ఆందోళన చెందారు. ఫలితాలను http://neet.nta.nic.in/ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడకు చెందిన రుషీల్ నీట్లో ఐదో ర్యాంకు సాధించాడు. తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన శరణ్య 60వ ర్యాంకుతో సత్తా చాటారు.
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదలలో జాప్యం నెలకొనడంతో విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తం అయింది. ముంబైలోని ఓ పరీక్షా కేంద్రంలో ఇద్దరు విద్యార్థుల ఓఎంఆర్ షీట్లు తారుమారైనందున వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ముంబై హైకోర్టు ఆదేశించింది. అంతవరకు ఫలితాల విడుదల నిలిపివేయాలంటూ స్పష్టం చేసింది. ముంబై హైకోర్టు తీర్పుపై ఎన్టీఏ అధికారులు సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. కేవలం ఇద్దరి కోసం 16లక్షల మంది విద్యార్థుల ఫలితాలు ఆపలేమని దేశ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. నీట్ 2021 స్కోర్ ఆధారంగా MBBS, BDS, ఆయుష్, BVSc, AH కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.
Read Also..