పెళ్లి విందులో పదేపదే రసగుల్లాలు తింటున్నాడనీ.. మండే తందూర్ పొయ్యిలో బాలుడిని విసిరేశాడు!
ఓ బాలుడు పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడని క్యాటరింగ్ సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు. ఆ బాలుడ్ని అమాంతం ఎత్తి మండుతున్న తందూర్ పొయ్యి మంటలోకి విసిరేశాడు. దీంతో బాలుడు ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. హుటాహుటీన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా..

లక్నో, ఏప్రిల్ 17: పెళ్లి విందులో ఓ బాలుడు పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడని క్యాటరింగ్ సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు. ఆ బాలుడ్ని అమాంతం ఎత్తి మండుతున్న తందూర్ పొయ్యి మంటలోకి విసిరేశాడు. దీంతో బాలుడు ఒళ్లంతా తీవ్రంగా కాలిపోయింది. హుటాహుటీన బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ అమానుష ఘటన ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్లోని బస్తీ జిల్లాలోని దుర్జన్పూర్ గ్రామంలో ఏప్రిల్ 15న ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. ఈ పెళ్లి వేడుకకు చమన్ (11) అనే బాలుడు తన అమ్మమ్మతో కలిసి అక్కడి బంధువుల పెళ్లి వేడుకకు వెళ్లాడు. పెళ్లిలోని విందు భోజనం సమయంలో ఆ బాలుడు పలుమార్లు రసగుల్లాలు తీసుకున్నాడు. గమనించిన క్యాటరింగ్ కాంట్రాక్టర్ బాలుడిపై తీవ్రంగా ఆగ్రహించాడు. తొలుత చమన్ను పట్టుకుని బెదిరించాడు. అయినప్పటికీ బాలుడు పదే పదే రసగుల్లాలు తీసుకోవడంతో అతడ్ని అమాంతం పైకి ఎత్తి మండుతున్న తందూర్ పొయ్యి వద్దకు తీసుకెళ్లాడు. ఇంతలో చేయి పట్టుతప్పి బాలుడు తందూర్ మంటల్లో పడిపోయాడు. దీంతో క్యాటరింగ్ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడున్న పెళ్లి అతిథులు వెంటనే తందూర్ పొయ్యిలో పడిపోయిన చమన్ను బయటకు తీశారు. ముఖం నుంచి నడుము వరకు తీవ్రంగా కాలిపోవడంతో వెంటనే అయోధ్య మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడ్ని లక్నో మెడికల్ కాలేజీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న చమన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
చమన్ చిన్న తనంలోనే తల్లి చనిపోయింది. అప్పటి నుంచి బాలుడు బస్తీలోని బఘనాలాలో ఉన్న తన అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. ప్రస్తుతం 2వ తరగతి చదువుతున్న చమన్.. బుధవారం మలౌలి గోసాయి గ్రామంలో బంధువుల పెళ్లి ఉండటంతో అమ్మమ్మతో కలిసి అక్కడికి వెళ్లాడు. చమన్ ఇతర పిల్లలతో ఆడుకుంటూ ఉండగా.. ఉన్నట్టుండి ఆహార కౌంటర్ల వైపు వెళ్లి, అక్కడ ఒక స్టాల్లో ఉంచిన రసగుల్లాలు తినడం మొదలుపెట్టాడు. పలుమార్లు హెచ్చరించినా బాలుడు మాటవినకపోవడంతో క్యాటరింగ్ కాంట్రాక్టర్ చమన్ను మండే పొయ్యిలో విసిరేశాడు. చమన్ మేనమామ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు గుర్తుతెలియని క్యాటరింగ్ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పరారైన నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




