
హైదరాబాద్, మే 17: ప్రస్తుతం చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు అండమాన్ దాటి అరేబియా సముద్రంలోకి ప్రవేశించాయి. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో ఆగ్నేయ అరేబియా ప్రాంతంలోని కొంతమేరకు విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉందని పేర్కొంది. ఈ క్రమంలో మే 26న కేరళ తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశముందని ఐఎండీ పేర్కొంది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1వ తేదీన రుతుపవనాలు భారత్లోకి ప్రవేశిస్తాయి. కానీ ఈసారి కాస్త ముందుగానే కేరళను తాకనున్నాయి.
గత ఏడాది మే 27వ తేదీన రుతుపవనాలు భారత్లోకి వస్తాయని ఐఎండీ అంచనా వేసినప్పటికీ.. అంతకంటే ముందే అంటే మే 21వ తేదీనే రుతు పవనాలు కేరళలోకి ప్రవేశించాయి. ఈసారి కూడా మే 26 కంటే ముందే రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. అందుకు కారణం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడమే. ఇక జూన్ తొలివారంలోనే రాష్ట్రంలోకి కూడా రుతుపవనాలు ఎంటర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో బంగాళాఖాతం, అండమాన్ సముద్రాల్లో ఇప్పటికే రుతుపవనాల మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. గత రెండు రోజులుగా అండమాన్ దీవుల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గాలులు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. నైరుతీ రుతుపవనాలు మరింతగా విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని IMD తెలిపింది.
ఇదిలా ఉండే శనివారం రాష్ట్రంలో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా తానూరులో 45.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భోరజ్లో 45.5, నిజామాబాద్ జిల్లా భీంగల్లో 45.3, జగిత్యాల జిల్లా గోధూరులో 45.2, కామారెడ్డి జిల్లా ఏలుపుగొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్లలో 45.1 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.