AICC Elections: ప్రచారంలో దూకుడు.. హైదరాబాద్ కు చేరుకున్న ఖర్గే.. కాంగ్రెస్ సీనియర్ నేత అసంతృప్తి..

|

Oct 08, 2022 | 1:27 PM

మల్లికార్జున ఖర్గే పర్యటన సందర్భంగా కూడా కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడ్డాయి. మల్లికార్జున్ ఖర్గేకు స్వాగతం పలికే జాబితాలో తన పేరు లేకపోవడంపై సీనియర్ నేత, మాజీ ఎంపీ..

AICC Elections: ప్రచారంలో దూకుడు.. హైదరాబాద్ కు చేరుకున్న ఖర్గే.. కాంగ్రెస్ సీనియర్ నేత అసంతృప్తి..
Mallikarjun Kharge In Hyderabad
Follow us on

అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పదవికోసం పోటీపడుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు మల్లికార్జున్ ఖర్గే తన ప్రచార దూకుడును పెంచారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తై.. పరిశీలన అయ్యాక మల్లికార్జున్ ఖర్గే తో పాటు మరో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ మాత్రమే పోటీలో ఉన్నారు. ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే పార్టీ అధిష్టానం ఖర్గే అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతున్న సంకేతాలు వెలువడటంతో మల్లికార్జున్ ఖర్గే ఎక్కడికి వెళ్లినా ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలుకుతున్నారు. మహారాష్ట్రలోని ముంబై నుంచి తన ప్రచారాన్ని ప్రారంభించిన మల్లికార్జున్ ఖర్గ అక్టోబర్ 8వ తేదీ శనివారం హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని పార్టీ సీనియర్లు ఆయనకు బేగంపేట విమానశ్రయంలో స్వాగతం పలికారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులైన వారితో మల్లికార్జున్ ఖర్గే సమావేశమై తన అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరనున్నారు.  మల్లికార్జున్ ఖర్గే దేశ వ్యాప్తంగా పర్యటించి ఓట్లను అభ్యర్థించేందుకు ఏఐసీసీకి చెందిన కొందరు నేతలు ఆయన పర్యటనలో ఉండేటట్లు అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఆయన హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆయన వెంట తెలంగాణకు చెందిన ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ ఉన్నారు.

తాజాగా మల్లికార్జున ఖర్గే పర్యటన సందర్భంగా కూడా కాంగ్రెస్ లో లుకలుకలు బయటపడ్డాయి. మల్లికార్జున్ ఖర్గేకు స్వాగతం పలికే జాబితాలో తన పేరు లేకపోవడంపై సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఫైర్ అయ్యారు. కావాలనే మాజీ పీసీసీలను అవమానిస్తున్నారని టీపీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వి.హనుమంతురావు కూడా కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిఉన్నారు. అలాగే తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి, వి.హనుమంతురావుకు ఇటీవల కాలంలో పొసగడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో విహెచ్ ను పక్కన పెట్టారనే వాదన కూడా కాంగ్రెస్ లోనే ఓ వర్గం నుంచి వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరోవైపు కేరళకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్ కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి రేసులో ఉన్నారు. ఇటీవల ఆయన కూడా హైదరాబాద్ వచ్చినప్పటికి పీసీసీకి చెందిన పెద్దలెవరూ ఆయనను రిసీవ్ చేసుకోలేదు. అతడి పర్యటనను పెద్దగా పట్టించుకోలేదు. అయితే మల్లికార్జున్ ఖర్గే వైపే పార్టీ తాత్కాఇక అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మెగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో హైదరాబాద్ వచ్చిన మల్లికార్జున ఖర్గేకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పెద్దలు ఘన స్వాగతం పలికారు.

Mallikarjun Kharge

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..