Jitin Prasada joins BJP: కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. మాజీ కేంద్ర మంత్రి, ఉత్తరప్రదేశ్ కీలక నాయకుడు జితిన్ ప్రసాద బీజేపీలో చేరారు. బుధవారం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో రైల్వే మంత్రి పీయుష్ గోయల్ సమక్షంలో జితిన్ ప్రసాద కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. దీనికి ముందు జితిన్ ప్రసాద ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసానికి చేరుకొని ఆయనతో మాట్లాడారు. భేటీ అనంతరం జితిన్ ప్రసాద బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జితిన్ ప్రసాద యూపీ ఎన్నికల వేళ బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జితిన్ ప్రసాద గతేడాది జులైలో బ్రాహ్మణ చేతనా పరిషత్ నెలకొల్పి ఆ సామాజిక వర్గ సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడైన జితేంద్ర ప్రసాద తనయుడే జితిన్ ప్రసాద. 2001లో యూత్ కాంగ్రెస్లో చేరిన జితిన్ 2004 లోక్సభ ఎన్నికల్లో యూపీలోని షాజహాన్పూర్ నుంచి పోటీ చేశారు. యూపిఏ హయాంలో మన్మోహన్ కేబినెట్లో యువ మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీతో తనకు మూడు తరాల అనుబంధం ఉందని జితిన్ ప్రసాద పేర్కొన్నారు. అయితే బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని, మిగతా వన్నీ ప్రాంతీయ పార్టీలేనని జితిన్ ప్రసాద బీజేపీలో చేరాక పేర్కొన్నారు. అయితే యూపీ ఎన్నికలకు ముందు ప్రసాద బీజేపీలో చేరడం కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండిపడుతుందని పలువురు పేర్కొంటున్నారు.
Also Read: