ఇంద్రాణి ముఖర్జీయా అప్రూవర్గా మారేందుకు ఢిల్లీ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఆమె ఆరోపణలు ఎదుర్కొటున్నారు. ఈ కేసులో తాను అప్రూవర్గా మారతానంటూ కోర్టుకు విఙ్ఞప్తి చేయడంతో ప్రత్యేక న్యాయస్ధానం అంగీకరించింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కాంగ్రెస్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా నిందితులుగా ఉన్నారు. ఈ కుంభకోణం వెనుకు ఉన్న రహస్యాలన్నీ ఇంద్రాణికి తెలుసని సీఐబీ.. ఢిల్లీ ప్రత్యేక కోర్టుకు తెలిపింది. ఈ నేపధ్యంలోనే ఆమె అప్రూవర్గా మారేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ ఈనెల 11న జరగనుంది.
ఐఎన్ఎక్స్ మీడియాను 2007లో పీటర్ ముఖర్జియా, ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా కలిసి ప్రారంభించారు. అయితే ఈ సంస్ధకు నిబంధనలకు విరుద్ధంగా రూ.305 కోట్ల మేర విదేశీ పెట్టుబడులు వచ్చాయని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ నిధులు రావడం వెనుక అప్పటి ఆర్ధిక మంత్రి చిదంబరం హస్తం ఉన్నట్టుగా సీబీఐ అనుమానిస్తోంది. అదే విధంగా విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ( ఎఫ్ఐపీబీ) ఆమెదించడంలో ఆయన తనయుడు కార్తీ చిదంబరం పాత్ర కూడా ఉన్నట్టుగా సీబీఐ అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఈ కేసులో పదేళ్ల తర్వాత కార్తీ చిదంబరంపై కేసు నమోదైంది. ప్రస్తుతం పీటర్ ముఖర్జియా తన కుమార్తె షీనా బోరా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటూ ముంబై బైకుల్లా జైలులో ఉన్నారు.