మరో హనీమూన్ జంట మిస్సింగ్.. 13 రోజులైనా దొరకని ఆచూకీ.. ఏం జరిగిందంటే..
మేఘాలయ హనీమూన్ ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో పోలీసులే షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హనీమూన్ కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ కు చెందిన నవ దంపతులు సిక్కింలో కనిపించకుండా పోయారు.

హనీమూన్.. ప్రస్తుతం ఈ పేరు వింటే చాలా మంది వణికిపోతున్నారు.. ఎందుకంటే.. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన నూతన దంపతులు మేఘాలయకు హనీమూన్ కోసం వెళ్లి అదృశ్యమైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మేఘాలయ హనీమూన్ ఘటనలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తుంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లతో పోలీసులే షాక్ అయ్యేలా చేస్తుంది. ఈ కేసులో భర్త రాజా రఘువంశీని భార్య సోనమ్ సుఫారీ ఇచ్చి చంపించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ కేసుకు సంబంధించి మేఘాలయ పోలీసులు సోనమ్ సహా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. సోనమ్ యూపీలో పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగానే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హనీమూన్ కోసం వెళ్లిన ఉత్తరప్రదేశ్ కు చెందిన నవ దంపతులు సిక్కింలో కనిపించకుండా పోయారు.
యూపీలోని ప్రతాప్గఢ్ కి చెందిన కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ వివాహం మే5న ఎంతో ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత మే24న వారు సిక్కింకు హనీమూన్ కోసం వెళ్లారు. ఆనందంతో బయల్దేరిన ఈ జంట13 రోజులుగా సిక్కింలో కనిపించకుండా పోవటంతో ఆ రెండు కుటుంబాల వారు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నవ దంపతుల ఆచూకీ కోసం పోలీసులను ఆశ్రయించారు. కాగా, మే 29న కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అతని భార్య అంకితా సింగ్ ప్రయాణిస్తున్న వాహనం తీస్తా నదిలో లభించింది. దాదాపు 1,000 అడుగుల లోతున వీరు ప్రయాణిస్తున్న టెంపో పడిపోయిందని పోలీసులు నిర్ధారించారు. కానీ, అందులో ప్రయాణిస్తున్న దంపతులిద్దరి ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఇటీవల సిక్కింలో కురిసిన కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలోనే మే 29న సిక్కింలో కురిసిన వర్షాలకు భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. మంగన్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడటంతో సమీపంలో ప్రయాణిస్తున్న ఒక టెంపో 1000 అడుగుల లోతైన తీస్తా నదిలో పడిపోయింది. లాచెన్-లాచుంగ్ హైవే వెంబడి మున్సితాంగ్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకోగా, ఈ ప్రమాద సమయంలో వాహనంలో 11 మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలిసింది. వారిలో ఒకరు మరణించగా.. ఇద్దరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. కానీ మరో ఎనిమిది మంది ప్రయాణికులు కనిపించకుండా పోయారు. వారిలో యూపీకి చెందిన నూతన దంపతులు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్, అంకితా సింగ్ కూడా ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు.. వారి ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలు తీవ్రంగా గాలిస్తున్నాయి.
కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ మాట్లాడుతూ.. సిక్కింలో నా కొడుకు, కోడలు ప్రయాణిస్తున్న వాహనం వాగులో పడిపోవడంతో వారు కనిపించకుండా పోయారు. 13 రోజులు కావస్తున్నా ఇంకా వారి ఆచూకీ లభ్యంకాలేదు. గాలింపు చర్యలు వేగవంతం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పిల్లల ఆచూకీ లభించే వరకు తామంతా సిక్కింలోనే ఉంటామని కన్నీరు మున్నీరుగా విలపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..