
దేశంలోని పలు రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు వణికిస్తున్నాయి. అటు ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ను హఠాత్తుగా వచ్చిన వరదలు ముంచెత్తగా.. ఇటు దేశ ఆర్థిక రాజధాని ముంబైని రికార్డు స్థాయి వర్షపాతం అతలాకుతలం చేస్తోంది. కొండచరియలు విరిగిపడటం, నదులు ఉప్పొంగడంతో పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రహదారులు, వంతెనలు కొట్టుకుపోవడంతో ప్రజాజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
అరుణాచల్ ప్రదేశ్లో కురిసిన అతిభారీ వర్షాలు ఊహించని జలప్రళయాన్ని సృష్టించాయి. ముఖ్యంగా కేయీ పన్యోర్, లోయర్ సుబన్సిరి జిల్లాలపై ఈ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. ఈ ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో పాటు ఒక్కసారిగా ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించాయి. యాజలి, పోసా, యీయీ వంటి గ్రామాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. వందలాది ఇళ్లు, వేల ఎకరాల్లో సాగు చేసిన వ్యవసాయ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పోసాలోని NEEPCO కాలనీలో సుమారు 15 నివాస గృహాలు వరద ఉద్ధృతికి పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఓ ప్రధాన రహదారి వంతెన వరద నీటిలో కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
తక్కువ సమయంలోనే అత్యంత భారీ వర్షపాతం నమోదు కావడం వల్ల నదులలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగి ఈ ఘోర పరిస్థితి తలెత్తిందని అధికారులు చెబుతున్నారు. ఈ వరదల ధాటికి పలువురు స్థానికులు గల్లంతైనట్లు సమాచారం అందుతోంది. సహాయక బృందాలు రంగంలోకి దిగి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
అసోంలో హై అలర్ట్..!
అరుణాచల్ ప్రదేశ్లో కురుస్తున్న ఈ భారీ వర్షాల ప్రభావం దిగువన ఉన్న అసోం రాష్ట్రంపై పడే అవకాశం ఉంది. అరుణాచల్ నదుల నుంచి వచ్చే వరద నీటి వల్ల అసోంలోనూ వరద ముప్పు పొంచి ఉండటంతో అక్కడి ప్రభుత్వం తీవ్ర అప్రమత్తత ప్రకటించింది. ప్రజలు ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేసింది.
24 గంటల్లో 300 మి.మీ. వర్షపాతం!
మరోవైపు, దేశ ఆర్థిక రాజధాని ముంబైని సైతం భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నవీ ముంబైతో పాటు నగరంలోని పలు కీలక ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ప్రసిద్ధ దాదర్ స్టేషన్లో రైలు పట్టాలపై భారీగా నీరు నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు నీట మునిగాయి. అనేక చోట్ల రహదారులపై మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ మైళ్ల మేర నిలిచిపోయింది. గడిచిన 24 గంటల్లోనే నగరంలో ఏకంగా 300 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) వెల్లడించింది.
మరో రెండు రోజులు వానగండం!
ముంబైలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ అత్యంత ప్రమాదకరమైన ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది. రాబోయే మరో రెండు రోజుల పాటు నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..