సీనియర్ నేత, ట్రబుల్ షూటర్గా పేరున్న గులాం నబీ ఆజాద్ (Ghula nabi Azad) కాంగ్రెస్ పార్టీ పదవులు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తాను పార్టీకి రాజీనామా చేయడమే కాదు.. ఆ పార్టీ యువ రాజు రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సుదీర్ఘ లేఖ రాసిన ఆజాద్ పార్టీకి పూర్వవైభవం అసంభవం అని తేల్చేశారు. రాహుల్ ఎంట్రీతోనే కాంగ్రెస్ స్థాయి దిగజారడం మొదలైందన్నారు ఆజాద్. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ పదవులకు రాజీనామా చేసిన ఆయన కొత్త పార్టీని ఏర్పాటు చేస్తారా..? ఏం చేయబోతున్నారు..? ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..? ఇలాంటి ప్రశ్నలకు అవుననే ఆయన సన్నిహత వర్గాలు అంటున్నాయి. తన సొంత రాష్ట్రం నుంచి కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని ఆయన ప్లాన్ చేస్తున్నట్లుగా జాతీయ మీడియా ప్రచారం జరుగుతోంది. చివరిసారిగాఆయన చేసిన మాటల్లో కూడా అదే అర్థం వస్తోంది. రాజీనమా చేసిన గులాం నబీ ఆజాద్ మాటల్లో..” నేను జమ్ము కశ్మీర్ వెళ్తాను. ఆ రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెడతాను. జాతీయ స్థాయి అవకాశాలపై ఆ తర్వాత పరిశీలిస్తాను” అని పేర్కొన్నట్లుగా ఆ పత్రిక తెలిపింది. ఈ ఏడాది ద్వితీయార్ధంలో జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు అవకాశం ఉంది.
కాగా, తన సొంత రాష్ట్రమైన జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఉనికిని గట్టిగా చాటుకోవాలని ఆజాద్ కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే వారం ఆజాద్ జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. అక్కడ ఇతర స్థానిక పార్టీల నేతలతో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీపుల్స్ కాన్ఫరెన్స్, సొంత పార్టీ నేతలతో భేటీ కానున్నారు. ఆ రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల నేతలతోపాటు స్థానిక నాయకులతో వ్యక్తిగతంగా కలిసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే కొందరు స్థానికులతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి.. జమ్ము కశ్మీర్ వేదికగా విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా సమాచారం.
ఐదు పేజీల లేఖలో..
అయితే.. 73 ఏళ్ల ఆజాద్కు జమ్ము కశ్మీర్లో కీలక పదవికి కాంగ్రెస్ పార్టీ ఇటీవల ఆఫర్ ఇచ్చినప్పటికీ ఆయన నిరాకరించారు. తొమ్మిదేళ్లుగా తాను చేసిన సిఫారసులను ఏఐసీసీ ఏరోజూ పట్టించుకోలేదని ఆజాద్ శుక్రవారం తన రాజీనామా లేఖలో విమర్శలు గుప్పించారు. రాహుల్ అపరిపక్వ నాయకత్వాన్ని ఎండగడుతూ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కారణంగానే పార్టీని వీడుతున్నట్టు పార్టీ అధ్యక్షుాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో ఆజాద్ పేర్కొన్నారు. ఐదు పేజీల రాజీనామా లేఖలో తాను పార్టీలో చేరిన సందర్భం నుంచి పార్టీ కోసం తాను పడ్డ శ్రమను వివరించారు. ఆరోగ్యం, కుటుంబాన్ని పణంగా పెట్టి పార్టీ కోసం తాను ఎంతో పాటుపడ్డానని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కారణంగానే పార్టీని వీడుతున్నట్టు లేఖలో ఆజాద్ స్పష్టం చేశారు. 2013లో రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలో సంప్రదింపుల యంత్రాంగాన్ని సమూలంగా నాశనం చేశారని ఆజాద్ విమర్శించారు. సోనియా గాంధీ కేవలం ఉత్సవ విగ్రహంగా మిగిలారని, రాహుల్ గాంధీ, ఆయన సెక్యూరిటీ గార్డులు, పీఏలు కీలక నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ సామర్ధ్యాన్ని దుమ్మెత్తి పోశారు. సీరియస్నెస్ లేని వ్యక్తి చేతిలో పార్టీ గత 8 ఏళ్లుగా చిక్కుకుపోయిందని మండిపడ్డారు. సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ఒక ప్రహసనంగా మారిందని ఆరోపించారు. పార్టీలో సీనియర్లు, అనుభవమున్న లీడర్లను పక్కకు తప్పించి అనుభవం లేని భజనపరుల కొత్త కొటరీ పార్టీని నడిపిస్తోందని రాజీనామా లేఖలో గులామ్ నబీ ఆజాద్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ పిల్లచేష్టలు, అనుభవలేమి కాంగ్రెస్ పతనానికి కారణమని అన్నారు. మీడియా సమక్షంలో రాహుల్ గాంధీ కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్స్ను చించేయడం ఆయన అపరిపక్వత, పిల్ల చేష్టలకు నిదర్శనమని ఆజాద్ ఆరోపించారు. 2014లో UPA ప్రభుత్వ పతనంలో అది కూడా కీలక పాత్ర పోషించిందని విమర్శించారు. UPA ప్రభుత్వ నిజాయితీకి భంగకరంగా నిలిచిన రిమోట్ విధానం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంటుకుందని ఆజాద్ తన లేఖలో పేర్కొన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం